
స్వీయ దర్శకత్వంలో బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు ముందే పలు వివాదాలు, న్యాయసంబంధ చిక్కులను అధిగమించి వాయిదా పడుతూ వస్తోంది. ఆ సినిమా ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ను ఖరారు చేసుకుంది. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమా వచ్చే ఏడాది 2025 జనవరి 17న రానున్నట్లు ఆమె వెల్లడించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను సినిమాలో ప్రముఖంగా చూపించనున్నారు. అయితే ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైనప్పటి నుంచే చిత్రంపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ సిక్కు వర్గాలు అభ్యంతరం తెలుపుతూ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా వ్రాసాయి.
దీంతో, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డులోనూ చాలా సమస్యలున్నాయని, తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడంలేదంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటూ బాంబే హైకోర్టు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్ను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ అక్టోబర్ 17న వచ్చింది. తమ సినిమాకు సెన్సార్ పనులు పూర్తైనట్లు కంగన కూడా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తొలుత ఈ చిత్రం సెప్టెంబర్ 6న వచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత కూడా పలు కోర్టు కేసులను కూడా ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. మరోవైపు, ఈ సినిమా విషయంలో కంగన హత్యా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా విజయానికి దూరంగా ఉన్న కంగనా రనౌత్ ఈ ఎమర్జెన్సీ చిత్రం పైనే ఆశలు పెట్టుకున్నారు. అంతకుముందు ఓ సందర్భంలో ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు తెలిపారు.
మొదటి షెడ్యూల్ సమయంలో అయితే డెంగీ బారినపడి రక్తకణాల సంఖ్య భారీగా పడిపోయినా, షూట్లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు. ఈ చిత్రానికి ఆమె దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే నటించారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’