తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారింది

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారింది

మాజీ సిఎ కెసిఆర్ బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ల డిఎన్ఎ ఒక్కటేనని పేర్కొంటూ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మాటలు, విమర్శలతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ లతో తెలంగాణకు ఒరిగిందేమి లేదని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటిఎంగా మారిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే బస్తీ దావఖానాలు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణాలో ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చర్చల ద్వారా పరిష్కరించాల్సిన వ్యవహారం కలెక్టర్ పై దాడి వరకు వెళ్లింది. సిఎం సొంత నియోజకవర్గంలో దాడి జరగడం, రైతుల అరెస్టులు.. అసలు ఏం జరుగుతుందని సర్కార్ ను కిషన్ రెడ్డి నిలదీశారు. రైతులకు బోనస్ ఇస్తామని బోగస్ చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ సర్కార్ కు లేదని ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదుని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని చెబుతూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదని, అయితే పేదల ఇండ్లు కూలగొట్టకుండానే ప్రక్షాళన చేయొచ్చని చెప్పారు. తెలంగాణ సమాజాన్ని అవమానించేలా రేవంత్‌రెడ్డి మాటలున్నాయని దుయ్యబట్టారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్రలో రేవంత్‌రెడ్డి ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.