భారంగా మారుతున్న  విదేశీ ఉన్నత విద్య

భారంగా మారుతున్న  విదేశీ ఉన్నత విద్య

* కశ్మీర్‌పై చర్చ పట్ల ఆక్స్‌ఫర్డ్‌లో భారత విద్యార్థుల నిరసన

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అమెరికా చాలా కాలం నుంచి అత్యంత ప్రధాన గమ్యస్థానంగా కొనసాగుతున్నది. ఏటా ప్రపంచ దేశాల నుంచి అగ్రరాజ్యం అత్యధిక సంఖ్యలో విద్యార్థులను ఆకర్షిస్తున్నది. కానీ, అమెరికాతోపాటు పలు ఇతర దేశాల్లోని విద్యాసంస్థల్లో ఫీజులు ఏటేటా గణనీయంగా పెరుగుతుండటం విదేశీ విద్యార్థులను కలవరపెడుతున్నది. 
 
వారు ఎంచుకునే యూనివర్సిటీలు, కోర్సులను బట్టి ఈ ఫీజులు ఆధారపడి ఉంటాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ యూనివర్సిటీల్లో తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సుల కంటే హ్యుమానిటీస్‌, ఎడ్యుకేషన్‌, ఆర్ట్స్‌ కోర్సుల ఫీజులు తక్కువ.

ఐదారేండ్ల క్రితం అమెరికాలోని యూనివర్సిటీల్లో ట్యూషన్‌, ఇతర ఫీజులు కలిపి ఏటా సగటున 9,716 నుంచి 35,676 డాలర్ల (దాదాపు రూ.8.20 లక్షల నుంచి రూ.30.12 లక్షల) వరకు చెల్లించాల్సి వచ్చేది. కానీ, గత కొన్నేండ్లుగా ఈ ఫీజులు మరింత పెరగడంతో ప్రస్తుతం విదేశీ విద్యార్థులు ఏటా 25 వేల నుంచి 55 వేల డాలర్ల (దాదాపు రూ.22 లక్షల నుంచి రూ.47 లక్షల) వరకు చెల్లించాల్సి వస్తున్నది.

 
బ్రిటన్‌లోనూ విద్యా ఖర్చులు పెరిగాయి. ప్రస్తుతం అక్కడ ఏటా దేశీయ విద్యార్థులతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ విద్యార్థుల నుంచి 9,250 పౌండ్లు (దాదాపు రూ.9.27 లక్షలు), ఇతర దేశాల విద్యార్థుల నుంచి 10 వేల పౌండ్లు (దాదాపు రూ.10.02 లక్షలు), మెడిసిన్‌ తదితర స్పెషలైజ్డ్‌ డిగ్రీ కోర్సులకైతే దాదాపు 38 వేల పౌండ్లు (రూ.38.10 లక్షలు) వసూలు చేస్తున్నారు. 
 
కానీ, అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే బ్రిటన్‌లో విదేశీ విద్యార్థుల జీవన వ్యయం తక్కువ. అంతేకాకుండా బ్రిటన్‌లో చాలా యూనివర్సిటీలు స్వల్పవ్యవధితో కూడిన ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో అక్కడ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను నాలుగేండ్లకు బదులుగా మూడేండ్లలో, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులను రెండేండ్లకు బదులుగా ఏడాదిలో పూర్తి చేసుకునే వీలుంటుంది.
 
ఇలా ఉండగా, కశ్మీర్‌ అంశంపై చర్చా వేదికను నిర్వహించడాన్ని నిరసిస్తూ యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో భారత విద్యార్థులు గురువారం నిరసన ప్రదర్శన చేశారు. చర్చా వేదికను ఆపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ వేదిక ప్యానల్‌లోని కొందరు వ్యక్తులు విద్వేష ప్రసంగీకులని వారు ఆరోపించారు. 
 
వారిలో కొంతమందికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా ఒక వర్గం వారు కశ్మీర్‌లోని హిందువులను భయపెట్టి వారు ఎలా అక్కడి నుంచి పారిపోయేలా చేశారో విద్యార్థులు వివరించారు.