ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి

* అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద 16 డ్రోన్లు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్​కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. యాంటీ- నక్సలైట్ ఆపరేషన్​లో ఉన్న భద్రతా బలగాలకు శనివారం ఉదయం 8 గంటల సమయంలో నారాయణపుర్‌లోని అబూజ్‌మాడ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. జవాన్లపైకి కాల్పులు జరిపారు. 

వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. నక్సల్స్‌కు గట్టిపట్టున్న దట్టమైన అటవీ ప్రాంతాల్లో సంయుక్త భద్రతా బలగాలు గాలింపు జరుపుతుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలి నుంచి మవోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను రాయ్​పుర్​లోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​(బీఎస్​ఎఫ్), డిస్ట్రిక్ట్​ రిజర్వ్ గార్డ్(డీఆర్​జీ), స్పెషల్ టాస్క్​ ఫోర్స్​(ఎస్​టీఎఫ్) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోంది. సైన్యం, మావోయిస్టుల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా ఛత్తీస్‌గఢ్‌లో అతిపెద్ద నక్సల్స్ ఆపరేషన్ అక్టోబర్ 4న అబుజ్మడ్‌ అడవుల్లో జరిగింది. నక్సలైట్లపై నిర్వహించిన ఆ యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లు మరణించారు.

ఎన్‌కౌంటర్ జరిగిన పది రోజుల తర్వాత అక్టోబర్ 14న మావోయిస్టులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సల్స్‌ 31 మంది కాదని, మొత్తం 35 మంది అని పేర్కొన్నారు. అక్టోబర్ 18న బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ మాట్లాడుతూ.. ఆ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 38 మంది నక్సలైట్లు మరణించారని తెలిపారు.

కాగా, పంజాబ్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద సుమారు 16 డ్రోన్ల‌ను బోర్డ‌ర్ సెక్యూర్టీ ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. గ‌డిచిన వారం రోజుల నుంచి ఆ డ్రోన్లను సీజ్ చేశారు. దీనికి తోడు 16 కిలోల మ‌త్తుప‌దార్ధాల‌ను కూడా బీఎస్ఎఫ్ ద‌ళాలు ప‌ట్టుకున్నాయి. ఆ స్మ‌గ్లింగ్ కేసులో ఇద్ద‌ర్ని అరెస్టు చేశారు. న‌వంబ‌ర్ 9 నుంచి 15వ తేదీ వ‌ర‌కు 16 డ్రోన్ల‌ను కూల్చివేసిన‌ట్లు అధికారులు చెప్పారు.

గ‌తంలో ఓ వారంలో అత్య‌ధికంగా 10 డ్రోన్ల‌ను సీజ్ చేసేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య పెరిగిన‌ట్లు బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. అమృత్‌స‌ర్‌, తార్న్ త‌ర‌న్‌, గురుదాస్‌పూర్ సెక్టార్ల‌లో ఆ డ్రోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ ఏడాది 216 డ్రోన్లను రిక‌వ‌రీ చేశారు. అయితే 2023లో మొత్తం 107 డ్రోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్ భూభాగం నుంచి ఎగురుతున్న ఆ డ్రోన్ల‌తో నార్కోటిక్ ప‌దార్ధాలు, ఆయుధాలు, న‌కిలీ క‌రెన్సీ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు.