
నీటి బిల్లులకు హరిత సెస్ విధింపు యోచనపై విపక్ష బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమని, ఇదంతా ఉచిత గ్యారంటీల మహిమ అని ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్ టెంగింకై విమర్శించారు. ప్రభుత్వం పశ్చిమ కనుమలను పరిరక్షించాలనుకుంటే కేంద్రాన్ని నిధులు అడగాలి తప్ప, ఇలా ప్రజలపై భారం వేయడం తగదని హితవు చెప్పారు.
అయితే హరిత సెస్ విధింపు ఎంతమాత్రం నిజం కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఇది కేవలం బీజేపీ చేస్తున్న ప్రచారమేనని, నీటి పన్నుపై తాము ఎలాంటి అదనపు సెస్ విధించడం లేదని తెలిపారు.
మరోవంక, చేతనైతే తనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించాలని విపక్ష బీజేపీకి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, అలాంటి కుటిల ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తే ప్రజలు ప్రశాంతంగా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
అయితే, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కో ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్లు లంచమిచ్చినట్టు చేసిన వ్యాఖ్యల మూలాలను వెల్లడించాలని, తన ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిరూపించుకోవాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి తన సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదని, అందుకనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి తన ఆరోపణలను నిరూపించకుంటే ఇకపై ఆయన మాటలను ప్రజలు విశ్వసించబోరని విమర్శించారు. అయితే విజయేంద్ర సవాల్పై స్పందించేందుకు సిద్ధరామయ్య నిరాకరించారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఎందుకు అడుగుతున్నారని విలేకరులను ఎదురు ప్రశ్నించారు.
కాగా, ముడా కుంభకోణం కేసులో విచారణకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మాజీ చైర్మన్ కే మరిగౌడ గురువారం ఈడీ ముందు హాజరయ్యారు. ముడా చైర్మన్గా ఉన్న మరిగౌడ వ్యక్తిగత కారణాలతో గత నెలలో పదవికి రాజీనామా చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు