బీజేపీ భిన్నమైన రాజకీయ పార్టీ

బీజేపీ భిన్నమైన రాజకీయ పార్టీ

బీజేపీ పార్టీ అన్ని రాజకీయ పార్టీలకంటే భిన్నమైనదని, ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త సభ్యులను చేర్చుకోవటంతో పాటు బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులను ప్రజా స్వామ్యం పద్ధతి ద్వారా ఎన్నుకుని ముందుకి వెళ్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ప్రధాని మోదీతో సహా అందరూ తమ సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవటం జరుగుతుందని ఆమె చెప్పారు.

2014లో ఆరు నెలల పాటు సభ్యత్వాన్ని నమోదు చేసామని, ఆన్‌లైన్ ద్వారా మొదటి సారి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆమె గుర్తు చేశారు.గతంలో 11కోట్ల సభ్యత్వాన్ని ఆరునెలలో చేసామని, ఇప్పుడు 45 రోజుల్లో 22 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేసామని పురందేశ్వరి తెలిపారు. భవిష్యత్‌లో బీజేపీ ఒక బలమైన రాజకీయ పార్టీగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పని చేస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

జాతీయ స్థాయిలో పరిపాలనా దక్షత కనబరుస్తూ దేశాన్ని ఆగ్ర గామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీదేనని ఆమె కొనియాడారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో కేంద్రం సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాష్ట్ర రాజధాని అమరావతి కనెక్టివిటీ కొరకు రైల్వే నిర్మాణం చేపట్టడం సంతోషకరమని ఆమె కొనియాడారు.

కాగా, రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుందని, రూ. 12,500 కోట్లు పోలవరం పూర్తి చేయటానికి నిధులు కేటాయిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు.  రూ.900 కోట్ల పై చిలుకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం సాయం అందిస్తామని తెలియచేసారు.

గ్రామ సభల్లో ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాన్ పర్యటించి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాల గురించి తెలియచేసారని, గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను పక్క దారి పట్టించిన విధానాన్ని పవన్ కళ్యాన్ సైతం గ్రామ సభల్లో వివరించారని పురందేశ్వరి పేర్కొన్నారు. దేశంలో ఎన్డీయేఉండాలని, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆమె చెప్పారు