విశాఖ – విజయవాడ మధ్య మరో రెండు విమానాలు

విశాఖ – విజయవాడ మధ్య మరో రెండు విమానాలు

విశాఖపట్నం – విజయవాడ మధ్య కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు.

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది.  ఇండిగో సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది.

ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ – విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య 3కు చేరనుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ, విశాఖ-విజయవాడ మధ్య ఫ్లైట్ కనెక్టివిటీ పెంచాలని చాలా మంది కోరారని తెలిపారు. ఒకేసారి రెండు నగరాల మధ్య రెండు ఫ్లైట్లు ప్రారంభం కావడం బహుశా ఇదే మొదటిసారి అని, ప్రజల కోరిక మేరకు ఈ మార్గంలో రెండు సర్వీసులు ప్రారంభించామని చెప్పారు.

రెండు నగరాల మధ్య ఎక్కువ సీట్లు అందుబాటులోకి రావడంతో విమాన టికెట్ల ధరలు తగ్గుతాయని, విశాఖ విజయవాడ మధ్య రూ.3000కే టికెట్ దొరికే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో దీనిని మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కనెక్టవిటీ ఎంతో అవసరమని, విశాఖ-గోవా మధ్య విమాన సర్వీసులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని, విశాఖ నుంచి అత్యధిక కనెక్టివిటీలు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ నిర్మిస్తున్నామని, ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేస్తున్నామని పేర్కొన్నారు.