తెలంగాణ స్పెషల్ పోలీస్(టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
క్రమశిక్షణ శాఖలో పనిచేస్తూ ఆందోళనలు నిర్వహించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సస్పెన్షన్కు గురైన వారిలో 3 బెటాలియన్కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. 17వ బెటాలియన్ లో ఆరుగురు, నాలుగో బెటాలియన్ లో ఆరుగురు, ఐదులో 6, ఆరులో 5, 12లో 5, 13వ బెటాలియన్ లో ఐదు మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కాగా, ప్రభుత్వం చర్యలపై బెటాలియన్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బెటాలియన్లలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెటాలియన్ల పరిధిలో పని చేస్తున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. తొలుత కుటుంబ సభ్యులు నిరసనలు చేయగా, ఇటీవలే నేరుగా కానిస్టేబుళ్లే రోడ్లెక్కారు. పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి, ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ జితేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమక్షశిణకు మారుపేరైన పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కానిస్టేబుళ్లు ఆందోళనలు చేయడం సరికాదని హితవు చెప్పారు. ఈ ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందని పేర్కొన్నారు. ఆందోళనలలో పాల్గొన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. తెలంగాణ రిక్రూట్మెంట్ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని డీజీపీ గుర్తుచేశారు.

More Stories
వీర్ బాల్ దివస్ సందర్భంగా సిఖ్ త్యాగాలకు నివాళులు!
సింగరేణిలో రూ 25 కోట్ల జరిమానా మాఫీకై కుతంత్రం!
దేశ హితం, ఉద్యోగుల హితం, శ్రామికుల హితం కోసమేబీఎంస్