కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాకై సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం

కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాకై సొంత పార్టీ ఎంపీలు అల్టిమేటం
 
ఖల్థిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్‌ – కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాన జస్టిన్‌ ట్రూడోనే స్వయంగా ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ట్రూడో ఆరోపణలతో రెండేళ్లుగా భారత్‌, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 
 
అయితే ట్రూడో ఆరోపణలను మాత్రం భారత్‌ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఇప్పుడు కెనడా ప్రధాని చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
కెనడా అధికార లిబరల్‌ పార్టీకి చెందిన కొందరు సభ్యులు జస్టిన్‌ ట్రూడోకు అల్టిమేటం జారీ చేశారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే తిరుగుబాటు చేస్తామంటూ హెచ్చరించారు. ఈ మేరకు డెడ్‌లైన్‌ కూడా పెట్టారు. 
 
అక్టోబర్‌ 28లోగా రాజీనామా చేయాలని తేల్చి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేసినట్లు ది గార్డియన్‌ తెలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమిని ఊహించి లిబరల్ నాయకుడిగా రాజీనామా చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్లు పేర్కొంది.
బుధవారం సమావేశంలో ఎంపీలు తమ ఆందోళనలు, నిస్పృహలను నేరుగా పీఎం ట్రూడోకు తెలియజేశారు. బుధవారం జరిగిన కాకస్ సమావేశంలో ట్రూడో రాజీనామాకు సంబంధించిన కేసును వివరించే పత్రాన్ని కూడా సమర్పించారు. 24 మంది ఎంపీలు లిబరల్ నాయకుడిగా ట్రూడోను వైదొలగాలని పిలుపునిచ్చేందుకు ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు సీబీసీ న్యూస్ నివేదించింది.

సమావేశంలో బ్రిటిష్ కొలంబియా ఎంపీ పాట్రిక్ వీలర్ ట్రూడో రాజీనామాకు అనుకూలంగా వాదించిన పత్రాన్ని సమర్పించారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో ఎంపీలు మాట్లాడేందుకు ఒక్కొక్కరికి రెండు నిమిషాల సమయం ఇచ్చారు. దాదాపు 20 మంది మాట్లాడారు. వారిలో ఎవరూ క్యాబినెట్ మంత్రులు లేరు. వచ్చే ఎన్నికలలోపు పక్కకు తప్పుకోవాలని ట్రూడోను కోరేందుకు లేచి నిలబడ్డారని సమాచారం. అయితే చాలా మంది ఎంపీలు కూడా ప్రధానికి మద్దతుగా నిలిచారని తెలుస్తోంది. కాగా, వచ్చే ఏడాది అక్టోబర్‌లో కెనడా పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఇక గత ఎన్నికల్లో ప్రధాని జస్టిన్‌ ట్రూడో సార్థ్యంలోని లిబరల్‌ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ట్రూడో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. 

కరోనా నియంత్రణలో సమర్థంగా చర్యలు తీసుకున్నందుకు ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెడతారన్న నమ్మకంతో ట్రూడో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆయన మైనారిటీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకపోయినా ‘మధ్యంతర’ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ఇప్పుడు నాలుగోసారి అధికారం కోసం ట్రూడో సిద్ధమవుతున్నారు. 

కానీ, కెనడా చరిత్రలో గత 100 ఏళ్లలో ఏ నాయకుడూ నాలుగోసారి గెలిచిన దాఖలాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లిబరల్‌ ఎంపీలు ట్రూడోను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.