ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహం

ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో  రామ్‌చరణ్‌ మైనపు విగ్రహం

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అబుధాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం ప్రతినిధులు అధికారికంగా వెల్లడించారు.  సింగపూర్‌లోని మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహం కోసం ఇప్పటికే ఫొటోషూట్‌, కొలతలు తీసుకోవడం కూడా పూర్తయ్యింది.

వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు చరణ్‌ మైనపు విగ్రహాన్ని సిద్ధం చేసి సందర్శకుల కోసం అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.  మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ సెలబ్రెటీల మైనపు విగ్రహాలు కూడా కొలువు దీరాయి. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేశ్‌ బాబు, కాజల్‌ ఇలా పలువురు సెలబ్రెటీల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.

అయినప్పటికీ రామ్‌చరణ్‌ మైనపు విగ్రహం వాటన్నింటి కంటే కూడా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే రామ్‌చరణ్‌ మైనపు విగ్రహంలో ఆయన పెంపుడు శునకం రైమ్‌ కూడా భాగస్వామి కానుంది. ఇలా పెంపుడు జంతువులతో మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటివరకు కేవలం క్వీన్‌ ఎలిజిబెత్‌-2 మైనపు విగ్రహం మాత్రమే ఉంది. క్వీన్‌ ఎలిజబెత్‌-2 తర్వాత ఆ అవకాశం రామ్‌చరణ్‌కే రావడం విశేషం.

మేడమ్‌ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాటు కావడం పట్ల రామ్‌చరణ్‌ సంతోషం వ్యక్తం చేశారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇప్పటికే ఎంతోమంది సూపర్‌స్టార్స్‌ మైనపు విగ్రహాలు కొలువు దీరాయని, ఇప్పుడు ఆ సూపర్‌ స్టార్స్‌ సరసన చేరడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కష్టం, సినిమాపై తనకు ఉన్న ఫ్యాషన్‌ వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని పేర్కొన్నారు. రైమ్‌ తన జీవితంలో ముఖ్యమైన భాగమని, ఇప్పుడు అది కూడా ఈ గౌరవంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.