భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిపై అమెరికా అభియోగాలు

భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిపై అమెరికా అభియోగాలు
సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో భారత మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి వికాస్ యాదవ్​పై అగ్రరాజ్యం అభియోగాలు మోపింది. పన్నూ హత్య కుట్రలో ఆయన విఫలయత్నం చేశారని అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో పేర్కొంది. అమెరికా, కెనడా పౌరసత్వమున్న పన్నూను హత్యకు రీసెర్చ్‌ అండ్‌ అనలైజింగ్‌ వింగ్‌-రా తో సంబంధం ఉన్న వికాస్ యాదవ్ సహకరించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.

తాజాగా అమెరికా న్యాయశాఖ వికాస్​పై కిరాయికి హత్యతోపాటు మనీలాండరింగ్ అభియోగాలను మోపి విచారణ జరుపుతోంది. పన్నూ హత్యకు కుట్ర 2023 మేలో ప్రారంభమైందని అగ్రరాజ్యం తెలిపింది. ప్రస్తుతం వికాస్ యాదవ్‌ భారత్‌లోనే ఉన్నారు. విచారణ కోసం తమకు అప్పగించాలని అమెరికా దర్యాప్తు సంస్థలు భారత్‌ను కోరే యోచనలో ఉన్నాయి. 

రాజ్యాంగబద్ధంగా హక్కులను కలిగిన ఉన్న తమ పౌరులపై ప్రతీకారం లేదా హింసాత్మక చర్యలను తాము సహించబోమని ఎఫ్ బి ఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌వ్రే తెలిపారు.ఇప్పటికే కెనడాలో నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఆ దేశం ఆరోపిస్తుండగా, పన్నూ హత్యకు భారత అధికారి కుట్ర చేశారని అమెరికా అభియోగాలు మోపడం చర్చనీయాంశమైంది. 

పన్నూ హత్య కుట్ర కేసులో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తిపై ఇప్పటికే అమెరికా అభియోగాలు మోపింది. ఆ తర్వాత వ్యాపార, విహార యాత్ర కోసం చెక్‌ రిపబ్లిక్‌ వెళ్లిన ఆయనను గతేడాది జూన్‌ 30న అక్కడి విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల నిఖిల్ గుప్తాను అమెరికాకు చెక్ రిపబ్లిక్ అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. జులై 17వ తేదీన న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో ప్రవేశపెట్టినట్లు సమాచారం.

భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్‌ సుపారీ ఇచ్చారని అమెరికా ప్రాసిక్యూటర్లు అప్పట్లో అభియోగాలు మోపారు. ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి వికాస్ యాదవ్​పై అభియోగాలు నమోదు చేశారు. హత్య కోసం నిఖిల్‌ గుప్తాను వికాస్‌ యాదవ్‌ గత ఏడాది మే నెలలో నియమించుకున్నట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.

ఆ అభియోగపత్రంలో వికాస్‌ యాదవ్‌ భారత విదేశాంగ నిఘా సర్వీస్‌ ఉద్యోగినని, సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ హోదాలో సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాలను పర్యవేక్షించేవాడినని, సీఆర్‌పీఎ్‌ఫలో కూడా పనిచేశానని, యుద్ధ విమానాల శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పుకొన్నాడని పేర్కొన్నారు. అయితే దీనిని భారత ప్రభుత్వం మాత్రం నిర్ధారించలేదు. కానీ వికాస్‌ యాదవ్‌ మిలిటరీ డ్రస్‌లో ఉన్న ఫొటోను ఒకదానిని అభియోగపత్రానికి జత చేశారు.