
భారత్ లో ఓటీటీ, ఇతర ప్లాట్ ఫామ్ లలో కంటెంట్ ను పర్యవేక్షించడానికి నియంత్రించడానికి స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అది విధానపరమైన అంశం అన్న కోర్టు, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నీ విధాన పరమైన అంశాలపై దాఖలవుతున్నాయని, ఇప్పుడు ఇదో సమస్య అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఫలితంగా నిజమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కోల్పోతున్నామని వ్యాఖ్యానించింది.
ఓటీటీ సహా ఇతర ప్లాట్ఫామ్లలో కంటెంట్ను నియంత్రించడానికి ఓ స్వతంత్ర సంస్థ ఏర్పాటు చేయాలని లాయర్ శశాంక్ శేఖర్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం సినిమాల బహిరంగ ప్రదర్శనను నియంత్రించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్-సీబీఎఫ్సీ సంస్థ ఉందని పిటిషన్లో లాయర్ పేర్కొన్నారు.
కానీ, ఓటీటీల్లో కంటెంట్ను పర్యవేక్షించడానికి అలాంటి సంస్థ ఏదీ లేదని తెలిపారు. ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు స్వీయ నిబంధనలకు మాత్రమే కట్టుబడి ఉంటాయని, కానీ వాటిని పూర్తిగా పాటించవని ఆరోపించారు. ఎలాంటి తనిఖీలు లేకుండా వివాదాస్పద కంటెంట్ను ప్రదర్శిస్తాయని పిటిషనర్ చెప్పారు. అంతేకాకుండా దేశంలో 40కి పైగా ఓటీటీ, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు చెల్లింపు, ప్రకటనలతో కూడిన, ఉచిత ప్రాతిపదికన కంటెంట్ను పౌరులకు అందిస్తున్నాయని, ఆర్టికల్ 19 ద్వారా లభించిన భావ వ్యక్తీకరణ హక్కును దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్