`శత్రుత్వం ముగింపు’కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రూ 5 కోట్లు డిమాండ్

`శత్రుత్వం ముగింపు’కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రూ 5 కోట్లు డిమాండ్
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి శాశ్వతంగా ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు  ఇవ్వాలంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సాప్‌ నంబర్‌కు గురువారం రాత్రి బెదిరింపు మెసేజ్‌ రావడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.

“బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5కోట్లు చెల్లించాలి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ (ఇటీవల హత్యకు గురైన) కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని దుండగులు బెదిరించారు.

దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నామని ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.

ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి. ఇది గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ పనేనని పోలీసులు అనుమానించారు. ఆ వెంటనే ఇది ట్రైలర్‌ మాత్రమే, ముందుంది అసలు సినిమా అంటూ అన్మోల్‌ పోస్ట్‌ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు పక్కా ప్రణాళికతో సల్మాన్ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం వచ్చింది.

ఇందుకోసం పాకిస్థాన్​ నుంచి ఆయుధాలను తెప్పించిందని తెలిసింది. కేఏ-47, ఎం-16, ఏకే-92 తుపాకులు, హై-కాలిబర్‌ ఆయుధాలను తెప్పించినట్లు సమాచారం. వీటితో సల్మాన్ ఖాన్‌ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా పన్వేల్‌లోని ఆయన ఫామ్‌హౌస్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించాలని నిందితులు పథకం రచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు హర్యానాలోని పానిపట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.