
మరోవంక, ఈ కేసును ఈ ఏడాది సెప్టెంబర్ 24న అభియోగాల నమోదుకు లిస్ట్ చేశారు. అభియోగాల విచారణ నిమిత్తం ఈ నెల 16న రేవంత్ సహా నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. బుధవారం నాటి ఈడీ వాయిదాకు రావాలని, లేనిపక్షంలో తాను అదే కోర్టులో దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఆరేండ్లుగా ఓటుకు నోటు కేసులో కోర్టుల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్రెడ్డి హాజరైతే ట్రయల్ స్టార్ట్ చేస్తానని ఈడీ కోర్టు న్యాయమూర్తి చెప్తున్నారని, అందుకే ఒకసారి కోర్టు విచారణకు హాజరుకావాలని విజ్ఞప్తిచేశారు.
2015 జూన్ 1న జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసినందుకు ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కు రేవంత్ రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డారు. ఆ సమయంలో రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించి, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న ఎల్విస్ స్టీఫెన్ సన్, ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది.
అదే ఏడాది రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. 2023 డిసెంబర్ లో తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 65 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఈ కేసులో 2021 జూలై 25న చార్జిషీట్ దాఖలు చేసిన దర్యాప్తు ఏజెన్సీ రేవంత్ రెడ్డితో పాటు మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది. ఇందులో రేవంత్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది.
పీఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద నమోదు చేసిన వాంగ్మూలంలో ఎల్విస్ స్టీఫెన్ సన్ ను కలిసి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ లో ఓటు వేసేలా ఒప్పించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు మత్తయ్య జెరూసలెం (నిందితుల్లో ఒకరు) ధ్రువీకరించారు. ఎల్విస్ స్టీఫెన్ సన్ టీడీపీ ఎమ్మెల్సీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని, ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటింగ్ కు గైర్హాజరైతే రూ.3 కోట్లు ఇస్తామని, జెరూసలేం వెళ్లేందుకు విమాన టికెట్ తో పాటు రూ.3 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తనతో చెప్పారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.
2019 ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. రుద్ర ఉదయ్ సింహా అనే వ్యక్తితో తాను కొన్ని అంశాలపై చర్చిస్తుండగా కొందరు పోలీసులు బలవంతంగా సమీపంలోని అపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారని, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని చెప్పినట్టు ఈడీ ఆరోపిస్తోంది. అయితే, రేవంత్ రెడ్డి గన్ మెన్లు తమ వాంగ్మూలంలో రేవంత్ రెడ్డికి అలాంటిదేమీ జరగలేదని దర్యాప్తు బృందాలకువాంగ్మూలం ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్ ను రేవంత్ రెడ్డికి చూపించారని, అందులో అతను డబ్బును హ్యాండిల్ చేసి ఎల్విస్ స్టీఫెన్ సన్ కు ఇవ్వడం స్పష్టంగా కనిపించిందని మరో అధికారి తెలిపారు. అయితే, అతను తన సమాధానంలో ‘ఒక వ్యక్తి నాలాగే కనిపిస్తున్నాడు’ అని సమాధానం ఇచ్చినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని మరో ఈడీ అధికారి చెప్పారు.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాల దర్యాప్తులో రేవంత్ రెడ్డి నేరుగా ఓటుకు నోటుకు సంబంధించిన నేరంలో పాలుపంచుకున్నారని, పీఎంఎల్ ఏ సెక్షన్ 4 ప్రకారం మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారని తేలింది. ఫిర్యాదుదారుడు ఒక నిర్దిష్ట అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని ప్రేరేపించడం పిఎంఎల్ఏ ప్రకారం నేరమేనని, తద్వారా మనీలాండరింగ్ నేరానికి పాల్పడ్డాడని ఈడీ అధికారి తెలిపారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు