ఏపీకి రూ 988 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు

ఏపీకి రూ 988 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.988 కోట్లకుపైగా మొదటి విడత విడుదలైంది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ప్రటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు (ఆర్‌ఎల్‌బి) 2024-25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంట్‌ల మొదటి విడతను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది.

రాష్ట్రానికి అన్‌టైడ్‌ గ్రాంట్లు మొత్తం రూ.395.5091 కోట్లు, టైడ్‌ గ్రాంట్‌లు మొత్తం రూ.593.2639 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్రంలో సక్రమంగా ఎన్నికైన తొమ్మిది అర్హతగల జిల్లా పంచాయతీలు, 615 అర్హతగల బ్లాక్‌ పంచాయతీలు, 12,853 అర్హతగల గ్రామ పంచాయతీలకు సంబంధించినవని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది.

అన్‌టైడ్‌ గ్రాంట్లు వ్యవసాయం, గ్రామీణ గృహాల నుంచి విద్య, పారిశుధ్యం వరకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌లోని 29 విషయాల్లో నిర్దిష్ట స్థానిక అవసరాలను పరిష్కరించేందుకు పంచాయతీలను అనుమతిస్తుందని, అయితే, ఈ నిధులు జీతాలు లేదా ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఖర్చుల కోసం ఉపయోగించకూడదని పేర్కొంది.  టైడ్‌ గ్రాంట్లు పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్‌) స్థితి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్‌, గృహ వ్యర్థాల శుద్ధితో సహా నీటి నిర్వహణ వంటి ప్రధాన అంశాలపై ఖర్చు చేయాలంది.

ఈ గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రంతోపాటు రాజస్థాన్‌కు కూడా విడుదల చేసింది.  రాజస్థాన్‌కు మొత్తం రూ.1,267 కోట్లు విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో ఎన్నికైన 22 అర్హత గల జిల్లా పంచాయతీలు, 287 అర్హత గల బ్లాక్‌ పంచాయతీలు, 9,068 అర్హత గల గ్రామ పంచాయతీలకు రూ.507.1177 కోట్ల అన్‌టైడ్‌ గ్రాంట్లు, రూ.760.6769 కోట్ల టైడ్‌ గ్రాంట్లు విడుదల చేసింది.

ఇలా ఉండగా, గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాల మేరకు, పల్లెల్లో రూ. 4,500 కోట్ల విలువైన  పనులు ప్రారంభిచాలని ఆదేశించారు.

మొత్తం 30 వేల ప‌నులు చేపట్టాల్సి ఉండగా, పెండింగ్లో మూడు వేల కిలో మీట‌ర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీట‌ర్ల మేర తారు రోడ్లు ఉన్నాయి. వీటితో పాటు రైతులకు ఉపయోగపడేలా పంట కుంట‌లు, ప‌శువుల షెడ్డులు, ఇంకుడు గుంత‌ల నిర్మాణం ప‌నుల్ని చేపట్టనున్నారు.