మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
డిల్లీ వర్శిటీ మాజీ ఆచార్యులు జీఎన్‌ సాయిబాబా తుదిశ్వాస విడిచారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం క్రితం నిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆయన్ని నాగ్‌పూర్‌ కేంద్ర కారాగారంలో ఉంచారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయిల్‌ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్‌ జైలులోనే ఉన్నారు. దీంతో 2021 ఫిబ్రవరిలో ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించారు.

సెషన్స్‌ కోర్టు జీవితఖైదు తీర్పుపై సాయిబాబా హైకోర్టులో అప్పీల్‌ చేశారు. యూఏపీఏ కేసులో పోలీసులు విధివిధానాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దీంతో బాంబే హైకోర్టు 2022లో సాయిబాబాపై కేసును కొట్టివేసింది. కానీ వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. మరోసారి విచారించిన హైకోర్టు ప్రొఫెసర్ సాయి బాబాతో పాటు మరో ఐదుగురిని విడుదల చేసింది.

రచయిత, మానవ హక్కుల కార్యకర్తగా పేరుపొందిన ఆచార్య సాయిబాబా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం. పోలియో సోకి ఐదేళ్ల వయసులోనే రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జైలులో ఖైదీల స్థితిగతులపైనా గళం విప్పిన ధీశాలిగా సాయిబాబా గుర్తింపు పొందారు. సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో చాలా ఏళ్ల పాటు ఇంగ్లిష్ బోధించారు.