పశ్చిమాసియాలో శాంతిసుస్థిరతను పునరుద్ధరించాలి

పశ్చిమాసియాలో శాంతిసుస్థిరతను పునరుద్ధరించాలి
యురేషియాతోపాటు పశ్చిమాసియాలో శాంతిసుస్థిరతను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు  గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
గురువారం వియాత్నాంలో జరుగుతున్న 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నించాలని ప్రపంచదేశాలకు సూచించారు. తాను బుద్ధుడు జన్మించిన దేశం నుండి వచ్చానని,  అయితే యుద్ధరంగంలో సమస్యలకు పరిష్కారాలు మాత్రం దొరకవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ద‌క్షిణాసియా ప్రాంతంలో చైనా ప్రాబ‌ల్యాన్ని గురించి ప్ర‌స్తావిస్తూ స్వేచ్ఛాయుత ఇండో ప‌సిఫిక్ విధానాల వ‌ల్ల ఈ ప్రాంతంలో శాంతి నెల‌కొంటుంద‌ని ప్రధాని తెలిపారు. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో శాంతి, భ‌ద్ర‌త‌, స్థిర‌త్వం వ‌ల్లే ఇండో ప‌సిఫిక్ ప్రాంతంలో శాంతి ఉంటుంద‌ని తేల్చి చెప్పా రు. స‌ముద్ర కార్య‌క‌లాపాల‌న్నీ యూఎన్సీఎల్వోఎస్ కు అనుగుణంగా జ‌ర‌గాల‌ని ఆయ‌న కోరారు. 

నావిగేష‌న్‌, ఎయిర్‌స్పేస్‌పై స్వేచ్ఛ ఉండాల‌ని చెబుతూ ప్రాంతీయ దేశాల విదేశీ విధానాల‌పై ఆంక్ష‌లు ఉండ‌వ‌ద్దని హితవు చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల‌ని, కానీ విస్త‌ర‌ణ‌పై కాద‌ని రాదని హెచ్చరించారు.  సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతోపాటు అంతర్జాతీయ చట్టాలను సైతం గౌరవించాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు.

చర్చలకు, దౌత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలో విశ్వ బంధు భారత్ అన్ని విధాలుగా సహకరాన్ని అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.  అలాగే ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా పక్కనే ఉన్న మయన్మార్‌తో భారత్ కలిసి నడుస్తుందని చెప్పారు.

పొరుగుదేశం భారత్ తన బాధ్యతను కొనసాగిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో తూర్పు ఆసియా సదస్సు అత్యంత ముఖ్యమైనదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.

కాగా, ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాక్ దేశాల మధ్య పోరు రోజూ రోజుకు తీవ్రతరం అవుతుంది. అలాగే పలు దేశాల మధ్య సంబంధాలు సైతం ఉప్పు నిప్పు తరహాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం లండన్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జ్యూరిట్స్ అండ్ రైటర్స్ ఫర్ వరల్డ్ ఫీస్ స్పందించింది.  ఈ ఘర్షణలను నిలుపుదల చేసేందుకు శాంతి దౌత్యం జరపాలని ప్రధాని మోదీకి ఈ ప్రపంచ సదస్సు‌లో పాల్గొన్న ప్రముఖులు విజ్జప్తి చేశారు. అందుకోసం వెంటనే రంగంలోకి దిగాలని వారు సూచించారు. లేకుంటే మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశముందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు