పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గత నెల 22న చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పవన్‌ కల్యాణ్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారాహి డిక్లరేషన్ బుక్‌తో ఆలయం వెలుపలకు పవన్‌ వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో ఆసక్తిగా భక్తులు గమనించారు. 

కాలినడక సమయంలో తన వెంట ఉంచుకున్న డిక్లరేషన్‌ పుస్తకాన్ని స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు తీసుకెళ్లారు. వన్‌కల్యాణ్‌ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు చిన్న కుమార్తె పొలెనా అంజనా స్వామివారి దర్శనానికి డిక్లరేషన్‌  ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. 

పొలెనా మైనర్‌ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్‌కల్యాణ్‌ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్విటర్ లో పోస్ట్‌ చేసింది.  ఇవాళ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంటారు. ఐదున్నరకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహించే వారాహి సభలో పాల్గొంటారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న పవన్ కల్యాణ్, అలిపిరి మెట్లమార్గం నుంచి కాలినడకన రాత్రి తిరుమలకు వచ్చారు. కాలిబాట గుండా బయలుదేరిన పవన్‌కళ్యాణ్ వెంట భారీగా అభిమానులు తరలివచ్చారు. మార్గమధ్యలో భక్తులతో మాట్లాడుతూ అక్కడక్కడ సేద తీరారు. 
 
గత సంవత్సరం చిరుత దాడిలో మృతి చెందిన లక్షిత, చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ వివరాలను ఏడో మైలు వద్ద అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిరుతల నుంచి రక్షణకు అటవీశాఖ చేపట్టిన చర్యలను అధికారులు పవన్‌కు వివరించారు. రాత్రి గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.