న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధతో బాధితులకు న్యాయం

న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధతో బాధితులకు న్యాయం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేధను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపిచ్చారు. ధనికుడితో పోలిస్తే పేదలకు న్యాయం పొందడం లేదని, మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. 

స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి, ఆదర్శంగా నిలిచారని ఆమె గుర్తు చేశారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని చెబుతూ  అంతర్జాతీయ న్యాయం నేపథ్యంలో వివిధ వివాదాలకు సంబంధించి కక్షిదారులపై అవగాహన దిశగా న్యాయ నిపుణులు, న్యాయమూర్తులు అల్గారిథమ్ అంశాలతో కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె చెప్పారు. 

అందువల్ల న్యాయ విద్యలో ఉత్తీర్ణులైన విద్యార్థులంతా భవిష్యత్ న్యాయ నిపుణులుగా ఎదగడంలో నానాటికీ విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడానికి సిద్ధం కావాలని రాష్ట్రపతి సూచించారు. భారత్ వంటి దేశానికి ఘన చరిత్ర మన జాతీయ ప్రతిష్టను, ఆకాంక్షలను సగర్వంగా ముందుకు తెస్తుందని, రాజ్యాంగ సభలో తన తుది ప్రసంగం సందర్భంగా ప్రాచీన భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, పద్ధతులను డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పష్టం చేశారని ఆమె గుర్తు చేశారు. 

భారత రాజ్యాంగంలో మన స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలు- న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రాలను పొందుపరిచారని ముర్ము పేర్కొన్నారు. ముఖ్యంగా పీఠిక, ప్రాథమిక హక్కులలో పొందుపరచిన సమానత్వానికి సంబంధిత ఆదర్శం, న్యాయ ప్రదానంలో ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించే ఆదేశిక సూత్రాలలోనూ ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు.

అందరికీ సమాన న్యాయ ప్రదానం అని, ఉచిత న్యాయ సహాయం అందాలని ఈ సూత్రాల్లో ఒకటి అని రాష్ట్రపతి గుర్తుచేసేరు. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం అందించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నల్సార్ విశ్వవిద్యాలయ దార్శనిక పత్రం కూడా స్పష్టం చేస్తోందని ఆమె కొనియాడారు. కానీ, సంపన్నులకు లభించే న్యాయం నిరుపేదలకు లభించకపోవడం దురదృష్టకరమని చెబుతూ ఈ పరిస్థితిలో మార్పు రావాలని రాష్ట్రపతి స్పష్టం చేశారు. 

ఈ మార్పు తేవడంలో ఈతరం న్యాయ నిపుణులు వైతాళికులు కావాలని ముర్ము ఆకాంక్షించారు. నల్సార్ విశ్వవిద్యాలయం జంతు సంరక్షణ చటాల గురించి చేస్తున్న కృషిని రాష్ట్రపతి ప్రస్తావించారు. ఒడిశా ప్రభుత్వంలో తాను మత్స్యశాఖ, జంతు వనరుల అభివృద్ధి మంత్రిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో, ప్రాచీన భారత్‌దేశంలో చట్టపరమైన పరిపాలనా వివరణ ఉన్నదని ఆమె తెలిపారు.

నల్సార్ నుంచి పిహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు రాష్ట్రపతి అందజేశారు.  అలాగే నల్సార్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్, హైకోర్టు సిజె జస్టిస్ అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ డిగ్రీ, పిజి, పిహెచ్‌డి పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. బంగారు పతకాల అందుకున్న వారిలో బాలురు కంటే బాలికలు ఎ క్కువ సంఖ్యలో ఉండటం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.

గవర్నర్ జిష్ణదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, నల్సార్ యూ నివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరాయ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి కూడా పాల్గొన్నారు.