‘అర్బన్‌ నక్సల్స్‌’ సానుభూతిపరులతో కాంగ్రెస్ హైజాక్

‘అర్బన్‌ నక్సల్స్‌’ సానుభూతిపరులతో కాంగ్రెస్ హైజాక్

అర్బన్‌ నక్సల్స్‌ సానుభూతిపరులతో కాంగ్రెస్ హైజాక్ అయిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్,  ఎన్​సీపీ, పీడీపీ పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ఆయన హెచ్చరించారు. జమ్ములోని ఎంఏఎం మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ  జమ్ముకశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారనీ ఉగ్రవాదం, వేర్పాటు వాదం లేని ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. 

తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని ఆశిస్తున్నారనిపేర్కొంటూ కాంగ్రెస్‌, ఎన్​సీపీ, పీడీపీ ఈ మూడు కుటుంబ పార్టీలతో జమ్ముకశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని  విమర్శించారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్షను ఇక్కడి ప్రజలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతానికి దూరంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని తెలిపారు. 

”ఇక్కడి ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఆశిస్తున్నాను. ఆ కారణంగానే జమ్మూకశ్మీర్ ప్రజలు బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నారు” అని మోదీ తెలిపారు.

దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల విలువ కాంగ్రెస్‌కు తెలియదంటూ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దుల్లో కాల్పులు జరిగితే, ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగురవేసిందని, కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగిందని ప్రధాని గుర్తు చేశారు.

“2016 సెప్టెంబరు 28 రాత్రి సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగింది. శత్రువుల భూభాగంలోకి వెళ్లి దాడి చేయగలిగిన సరికొత్త భారత్‌ను నాడు ప్రపంచమంతా చూసింది. దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ ఆ పార్టీకి తెలియదు. జవాన్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ గౌరవించలేదు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ సైనికులకు మాయమాటలు చెప్పింది. ‘వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌’ ఇస్తామంటూ వారిని ఎదురుచూసేలా చేసింది” అని ప్రధాని ఆరోపించారు.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో మొత్తం 61 శాతం పోలింగ్‌ నమోదవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. “ఈసారి విజయదశమి మనందరికీ ఎంతో ప్రత్యేకం. జమ్ముకశ్మీర్‌లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. పూర్తి మెజారిటీ అధికారంలోకి వస్తుంది” అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజల అభిమతంతో తొలిసారి జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడనుందని, ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని, బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు.