ముడా స్కామ్‌పై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం

ముడా స్కామ్‌పై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనంతరం బెంగళూరు ప్రత్యేక కోర్టు సైతం విచారణకు ఆదేశించింది.  ముడా స్కామ్​ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఉత్తర్వులు ఇచ్చింది. మూడు నెలల్లోగా ముడా స్కామ్‌పై పూర్తిగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ముడా స్కామ్​లో సీఎంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ స్నేహమయి కృష్ణ- ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జడ్జి సంతోష్ గజానన్​ భట్, దర్యాప్తు చేసి డిసెంబర్ 24 నాటికి నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.  గవర్నర్​ దర్యాప్తునకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించిన మరుసటి రోజే జడ్జి సంతోష్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. లోకాయుక్త దర్యాప్తు పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు పిటిషనర్ స్నేహమయి కృష్ణ తరపున న్యాయవాది లక్ష్మీ అయ్యంగార్ తెలిపారు.

“కోర్టు ఆదేశాల ప్రకారం వారు ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. మేము ఇంతకంటే ఏమీ ఆశించడం లేదు. దర్యాప్తులో నిజమే గెలుస్తుందని ఆశిస్తున్నా. పోలీసులు సాక్ష్యాల కోసం వెతకాల్సిన అవసర లేదని భావిస్తున్నా. ఎందకుంటే మేము అందించిన పత్రాలు, సాక్ష్యాలు అన్ని సమగ్రంగా ఉన్నాయని అనుకుంటున్నా” అని లక్ష్మీ తెలిపారు.

లోకాయుక్త పారదర్శకంగా దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆమె స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 14 స్థలాలను చట్టవిరుద్ధంగా ముడా కేటాయించిందని ఆరోపణలున్నాయి. తనపై విచారణకు గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.  ముడా స్కామ్​లో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.

‘దర్యాప్తు విషయంలో నేను భయపడడం లేదు. ప్రత్యేక కోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటా’ అని సిద్ధరామయ్య తెలిపారు.