గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారధితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.
లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన తప్పిదాలపై సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రగా రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అభివర్ణించారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థతో ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. తిరుమల బాలాజీ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వెళ్లి.. లడ్డూను ప్రసాదంగా స్వీకరిస్తుంటారని చెప్పారు.
ఇప్పటి వరకూ జరిగిన పరిశీలనలో మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూలో చేపనూనె వంటివి కలిసినట్లు తేలిందని, ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్ర, దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు తిరుమల ప్రసాదంలో కల్తీ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇది ఎంత మాత్రం క్షమించరాని నేరమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ప్రజల విశ్వాసం మీద జరిగిన దాడిగా బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. వ్యాపారం కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సైతం దీనిపై విచారణ చేయాలని కోరారు.

More Stories
రామయ్య వదలడు.. శివయ్య కదలడు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ను చంపేశారని పుకార్లు
భారతీయులకు 90 శాతం దాకా హెచ్1బీ వీసాలు నకిలీవే