సంజౌలి మసీదు వివాదంపై సిమ్లాలో ఉద్రిక్తత

సంజౌలి మసీదు వివాదంపై సిమ్లాలో ఉద్రిక్తత
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా బుధవారంనాడు నిరసనలతో అట్టుడికింది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. దేవభూమి సంఘటన్‌ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, స్థానికులు బుధవారం మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
 
పదేళ్ల కిందట చట్టవ్యతిరేకంగా నిర్మించిన నాలుగంతస్తుల మసీదును కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా నిరసనకారులు బారికేడ్లను దాటుకుంటూ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసు లాఠీజార్జి జరిపారు.
 
‘హిమాచల్‌ నే తానా హై, దేవభూమి కో బచానా హై’, ‘భారత్‌ మాతా కీ జై’ వంటి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు- ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. వాటర్‌కేన్లను ప్రయోగించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రదర్శకులు అక్రమ కట్టడాన్ని కూల్చేయాలంటూ నినాదాలు చేశారు. అనధికార మసీదు నిర్మాణంపై అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ప్రార్థనా మందిరమా కాదా అనేది ప్రశ్న కాదని, కట్టడం చట్టబద్ధతనే తాను ప్రశ్నిస్తున్నామని వారు స్పష్టం చేశారు.

ఈ వివాదం 2010 నాటిది. తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైంది. పలు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీదును 6750 చదరపుటడుగులు విస్తరించారు. ఇది హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమిగా చెబుతుండగా, మసీదు ఇమామ్ మాత్రం ఇది 1947 క్రితం నాటిదని, వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి అని చెబుతున్నారు.

అక్రమ మసీదు నిర్మాణంపై సెప్టెంబర్ 7న మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగింది. 2010 నుంచి 45 సార్లు ఇదే అంశంపై విచారణ జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఈ వ్యవధిలో మసీదు నిర్మాణం రెండు అంతస్తుల నుంచి ఐదు అంతస్తులకు పెరిగింది. ఆ ఏరియాలో ముస్లిం జనాభా వేగంగా పెరగడాన్ని కూడా స్థానికులు గుర్తించారు. మసీదును ఆ వర్గం వారు విస్తరిస్తూ భూ దురాక్రమణలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.