వరుస ఓటములతోనే విదేశీ గడ్డపై రాహుల్‌ అసహనం

వరుస ఓటములతోనే విదేశీ గడ్డపై రాహుల్‌ అసహనం

* రాహుల్‌ ఎన్నటికీ దేశ ప్రధాని కాలేరు

వరుస ఓటముల షాక్‌తో విదేశీ పర్యటనలో కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ తన అసహనం వెళ్లగక్కుతున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమర్శించారు. విదేశీ గడ్డపై సొంత దేశాన్ని విమర్శించడం దేశభక్తి కలిగిన వారు చేయాల్సిన పని కాదని ఆయన హితవు పలికారు. రాహుల్ ఇప్పుడు ప్రభుత్వాన్నే కాదు ఎన్నికల కమిషన్‌ను కూడా ప్రశ్నిస్తున్నారని ఝార్ఖండ్ లో ధ్వజమెత్తారు.

వరుస ఓటములతో రాహుల్‌ నిస్తేజానికి  కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. విపక్ష నేత హుందాగా వ్యవహరించాలని, ఆయన జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు. రాహుల్ భారత్‌ జోడో యాత్ర చేపట్టినా దేశంతో ఏమాత్రం మమేకం కాలేదని దుయ్యబట్టారు. ఇక జార్ఖండ్‌ను ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఆరోపించారు.

అపార సహజవనరులతో సుసంపన్నమైన రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం లూటీ చేసి విధ్వంసానికి తెగబడిందని చౌహన్ విమర్శించారు. జార్ఖండ్‌లో నేతల నుంచీ గుట్టులుగా పోసిన నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఐదేండ్లుగా ప్రజల కోసం వారు ఏమీ చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండగా హడావిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తగు ఏర్పాట్లు చేయకుండా 10 కిమీ పరిగెత్తమని పోటీ పెట్టడంతో పోలీస్ రిక్రూట్మెంట్ సందర్భంగా 12 మంది మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ ఝాఖండ్ యువత హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని ఎప్పటికి క్షమింపలేరని ఆయన స్పష్టం చేశారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేవలం వోట్ బ్యాంకు పాలిటిక్స్ లో భాగంగా చేసింది మాత్రమే అని ఆయన మండిపడ్డారు. ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేశారని చెబుతూ సొరేన్ ప్రభుత్వ దుష్పరిపాలన నుండి రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యం అని తెలిపారు.

జార్ఖండ్‌ పాలకుల తీరును రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారని, వాస్తవాలను ప్రజల ముందుంచి సోరెన్‌ సర్కార్‌ను సాగనంపేందుకు బీజేపీ సంసిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాషాయ సర్కార్‌ కొలువుతీరేలా పార్టీ శ్రేణులు పాటుపడుతున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ భరోసా వ్యక్తం చేశారు.

ఇక రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ (లలన్‌) సింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లలన్‌ సింగ్‌ మంగళవారం పట్నాలో మీడియాతో మాట్లాడుతూ  రాహుల్‌ గాంధీకి దేశభక్తి లేదని, ఆయన విదేశాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారని ధ్వజమెత్తారు. రాహుల్‌కు పరిణితి లేదని, ఆయన ఇంకా నేర్చుకుంటున్నారని హితవు చెప్పారు.  దేశాన్ని పాలించాలని రాహుల్ కలలు కంటున్నారని, కానీ ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని లలన్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు.