వియత్నాంలో యాగి విధ్వంసం.. 60 మంది మృతి

వియత్నాంలో యాగి విధ్వంసం.. 60 మంది మృతి

*కుప్పకూలిన వంతెన- బ్రిడ్జ్​తో సహా కొట్టుకుపోయిన వాహనాలు

చైనా, హంకాంగ్‌లో బీభత్సం సృష్టించిన టైఫూన్ యాగి వియత్నంలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ తుపానుతో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తాజాగా ఓ వంతెన కూలిపోయి చాలా మంది గల్లంతయ్యారు. కనీసం 60 మంది మరణాలకు కారణమైన టైఫూన్ యాగి వియత్నాంలో విలయం సృష్టిస్తోంది. ఎక్కువ వర్షం పడటంతో పలుచోట్ల ఘోర ప్రమాదాలు సంభవించాయి.

ఉత్తర వియత్నాంలోని ఫుథో ప్రావిన్స్‌లో రెడ్‌ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, రెండు బైక్‌లు నీళ్లలో పడిపోయాయి. వెనక వస్తున్న మరికొందరు ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. కళ్ల ముందే వాహనాలు నదిలో పడిపోవడం వల్ల భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. నదిలో పడిపోయిన వారిలో ముగ్గుర్ని సహాయక సిబ్బంది కాపాడారు. మరో 13 మంది గల్లంతు కాగా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

శనివారం వియత్నాంలో వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా 50 మంది మరణించారు. తర్వాత మరో 10 మంది మృతి చెందారు. ఉత్తర వియత్నాంలో అనేక నదుల నీటి మట్టాలు ప్రమాదకరంగా ఉన్నాయి. సోమవారం ఉదయం పర్వత కావో బ్యాంగ్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో 20 మంది ప్రయాణికుల బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.

రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో సంఘటన జరిగిన ప్రదేశానికి మార్గం మూసుకుపోయింది. ఫుథో ప్రావిన్స్‌లో రెడ్ రివర్‌పై ఉక్కు వంతెన సోమవారం ఉదయం కూలిపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు మోటార్‌బైక్‌లతో పాటు 10 కార్లు, ట్రక్కులు నదిలో పడిపోయాయని నివేదికలు తెలిపాయి. ముగ్గురిని నదిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో 13 మంది గల్లంతయ్యారు.

‘మోటార్‌సైకిల్‌పై వంతెన మీద వెళ్తున్నప్పుడు పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నదిలో పడిపోయాను. నేను నది దిగువకు మునిగిపోయినట్లు అనిపించింది. ఎలాగోలా ఈత కొడుతూ బయట పడ్డాను.’ అని ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి స్థానిక మీడియాకు చెప్పాడు.

టైఫూన్ యాగి కొన్ని దశాబ్దాలలో వియత్నాంను తాకిన బలమైన తుపాను. ఇది శనివారం 149 కి.మీ వేగంతో గాలులతో తీరాన్ని తాకింది. ఆ దేశ వాతావరణ  సంస్థ ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు రావొచ్చని, కొండచరియలు విరిగిపడవచ్చని హెచ్చరించింది. యాగి తుపానుతో దాదాపు 116,192 హెక్టార్లలో వ్యవసాయ భూమి కూడా దెబ్బతింది. వియత్నాంను తాకడానికి ముందు, యాగి గత వారం ఫిలిప్పీన్స్‌లో కనీసం 20 మరణాలకు, దక్షిణ చైనాలో నాలుగు మరణాలకు కారణమైంది.