బంగ్లాలో హిందువులపై దాడులు రాజకీయ ప్రేరేపితం!

బంగ్లాలో హిందువులపై దాడులు రాజకీయ ప్రేరేపితం!

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు రాజకీయ కారణంగానే జరుగుతున్నాయని  ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ చెప్పుకొచ్చారు. అందులో మతతత్వ కోణం లేదని పేర్కొన్నారు. భారత్‌లో ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.  హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉండటం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు మహమ్మద్ యూనస్ వెల్లడించారు.

అలాగే భారత్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ. తాము భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని భారత్ విడనాడాలంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా కొన్నిరోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందిస్తూ తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు.

మరోవంక, భారత్‌లో కూర్చొన్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు, ఆమె భారత్‌లో మౌనంగా ఉండాలని హితవు చెప్పారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

“హసీనాను తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్‌ అడిగే వరకు ఆమె భారత్‌లోనే ఉండిపోతే, మౌనంగా ఉండాలి. ఆమె అక్కడ ఉండి మాట్లాడటం ఇబ్బందిగా మారుతుంది. ఆమె మౌనంగా ఉంటే మేం దానిని మర్చిపోతాం. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సూచనలు చేయడాన్ని ఎవరూ ఇష్టపడరు” అని యూనస్ స్పష్టం చేశారు. 

దేశంలో దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. న్యాయం జరగాలంటే తిరిగి ఆమెను వెనక్కి తీసుకురావాలని, లేకపోతే బంగ్లాదేశ్‌ ప్రజలు శాంతించరని ఆయన హెచ్చరించారు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందే  అని యూనస్ తేల్చి చెప్పారు.