సెన్సార్ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు

సెన్సార్ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు

ఇందిరా గాంధీ జీవితం, ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ రోజుల ఆధారంగా కంగనా రనౌత్ నిర్మించిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కానుంది.  అయితే విడుద‌ల‌కు ఇంకా వారం రోజులు ఉన్న క్ర‌మంలో సెన్సార్ బోర్డ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కంగ‌నా. ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ఇంకా సర్టిఫికేట్‌ ఇవ్వట్లేద‌ని తెలిపింది.

”త్వ‌ర‌లోనే మా సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంటుంద‌ని ఆశిస్తున్నా. సెన్సార్‌ బోర్డులో చాలా స‌మ‌స్య‌లు ఉన్నాయి. మేము ‘ఎమర్జెన్సీ’ సినిమా సెన్సార్ స‌ర్టిఫికేట్ కోసం వెళ్లిన‌ప్పుడు కొంత‌మంది వ్య‌క్తులు డ్రామా క్రియేట్ చేశారు. నేను సెన్సార్ బోర్డ్‌ను న‌మ్ముతున్న. కానీ వాళ్లు నా సినిమాకు వాళ్లు సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ జారీ చేయ‌డంలో ఆల‌స్యం చేస్తున్నారు. నా సినిమా కోసం నేను పోరాటం చేయ‌డానికి  సిద్ధంగా ఉన్నా. అందుకోసం కోర్టు వ‌ర‌కు వెళ్లడానికి అయిన సిద్ధం” అంటూ కంగ‌నా చెప్పుకోచ్చింది.

తమతోపాటు సీబీఎఫ్‌సీ సభ్యులకు కూడా బెదిరింపులు వస్తున్నట్లు ఆమె వెల్లడించారు. “మా సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ వచ్చేసిందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదు. నిజానికి మా సినిమాకు సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ వచ్చినా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపారు. ఎందుకంటే సెన్సార్ వాళ్లను చంపేస్తామంటూ చాలా బెదిరింపు సందేశాలు వస్తున్నాయి” అని ఆ వీడియోలో కంగనా వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చూస్తే బాధేస్తోందని కూడా కంగనా ఆ వీడియోలో చెప్పింది. “మిసెస్ గాంధీ హత్యను చూపించకూడదని, భింద్రేవాలాను చూపించొద్దని, పంజాయ్ అల్లర్లను చూపించకూడదని మాపై ఒత్తిడి వస్తోంది. మరి ఏం చూపించాలో అర్థం కావడం లేదు. హఠాత్తుగా సినిమాను బ్లాకౌట్ చేస్తున్నారు. ఇది నమ్మశక్యం కాని సమయం. ఈ దేశంలో పరిస్థితులు చూసి నాకు చాలా బాధేస్తోంది” అని కంగనా ఆ వీడియోలో వాపోయింది.

ఎమర్జెన్సీ  మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో నటించడంతోపాటు మూవీని కంగనానే డైరెక్ట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది.  ఈ చిత్రం గ‌తేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండ‌గా.. అనుకోని కార‌ణాల వ‌ల‌న విడుద‌ల వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత జూన్ 14న విడుదల చేయానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

అయితే ఈ క్ర‌మంలోనే కంగ‌నా రాజకీయ ప్రవేశంతో  హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ‘మండి’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి గెల‌వ‌డంతో రాజ‌కీయ‌ల్లో బిజీ అయ్యి ఈ సినిమా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు.