
అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సమీక్షించారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్పురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం `ఏ’, చివరి అక్షరం ‘ఐ’ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని చెప్పారు.
రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలని తెలిపారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మళ్లీ రాజధాని పనులు వేగంగా పునరుద్ధరించాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు.
జీ+7విధానంతో నిర్మాణం తలపెట్టిన సీఆర్డీయే కార్యాలయంను గత టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేపట్టామో అంతకుమించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు కదల్లేదని, గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తీగా వదిలేసిందని, ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తీ చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు కూడా అత్యాధుని టెక్నాలజీలను ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని సూచించారు.
కాగా, టీడీపీ ప్రభుత్వం రాజధానిలో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపైన కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసముండాలని కోరుకునే వాళ్ల కోసం 14 ఎకరాల్లో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును రూపొందించామని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలో అమ్ముడపోయాయని, అయితే తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపేయడంతో కొనుగోలుదారులు వెనక్కివెళ్లిపోయారని
అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
దీనివల్ల సీఆర్డీఏకు భారీ నష్టం వచ్చిందని చెబుతూ హ్యాపీనెస్ట్ లో గత ప్రభుత్వం చర్యలతో ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని అధికారును ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించాలని చెప్పారు. రాజధానికి సంబంధించి ఇంకా 3,558 ఎకరాలు సేకరించాల్సి ఉందని, రాజధాని పరిధిలోని రెండు గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని సీఎంకు అధికారులు తెలిపారు.
అయితే అభివృద్ధి చేసిన ప్లాట్లను ఆ రైతులకు కేటాయించే విషయంలో చిన్న చిన్న అభ్యంతరాలున్నాయని అధికారులు వివరించగా రైతులతో మాట్లాడి దాన్ని పరిష్కరించి ముందుకెళ్లాలని సీఎం సూచించారు. రాజధానిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులపై సీఎం సమీక్షించారు. జంగిల్ క్లియరెన్స్ కోసం 190 హిటాచి మిషన్లు కంప చెట్లను తొలగిస్తున్నాయని, దాదాపు 60 శాతం జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!