
విద్యార్థుల పట్ల మమత నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయమైన విచారణ జరగాలంటే ఆమె వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని, వైద్యురాలిపై హత్యాచారం జరిగితే దానిని పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్యాచార ఘటనలో ప్రమేయం ఉన్న వారిని మమతా బెనర్జీ కాపాడుతున్నారని, ఆమెకు, కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్కు పాలీగ్రాఫ్ పరీక్ష చేస్తే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. నిజం తెలుసుకోవడానికి పోలీస్ కమిషనర్ వినీత్ గోయెల్కు కూడా లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యార్థులపై దాడులను పోలీసులు ఆపకపోతే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి హెచ్చరించారు. పోలీసుల చర్యలకు నిరసనగా బుధవారం 12 గంటల పాటు రాష్ట్రవ్యాప్త బంద్కు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందర్ పిలుపునిచ్చారు.
ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్’ నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో హావ్డా నుంచి విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హావ్డాలోని సంతర్గాచి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్