అధికారం, రాజకీయ బలం, డబ్బుతోనే లైంగిక వేధింపులు

అధికారం, రాజకీయ బలం, డబ్బుతోనే లైంగిక వేధింపులు

అధికారం, రాజకీయ బలం, డబ్బు. వల్లే సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవడం లేదని,  నేరస్తులను శిక్షించడం కష్టంగా మారుతోందని  ప్రముఖ సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్మయి తాజాగా హేమ కమిటీ పనితీరును ప్రశంసించారు. విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదిక సిద్ధం చేయగలిగిందని ఆమె తెలిపారు.

‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ వల్లే ఇది సాధ్యమైంది. ముందుగా డబ్లూసీసీకి హ్యాట్సాఫ్. ఇప్పటి వరకూ ఇలాంటిది ఏ చిత్ర పరిశ్రమలోనూ జరగలేదు. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉంటానేది బహిరంగ రహస్యం. సినిమా పరిశ్రమకు ఏదో ఒక విధంగా చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇక్కడ లైంగిక వేధింపులు సర్వసాధారణమని అందరూ నమ్ముతారు’ అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

అయితే, ఇలాంటి ఘటన జరిగిందని చెప్పినా నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడం లేదని, సమస్య గురించి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని, కేసు సంవత్సరాలపాటు సాగుతూనే ఉంటుందని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని కూడా చిన్మయి గుర్తు చేసుకున్నారు. ‘నేను తమిళ పాటల రచయిత వైరముత్తు నుంచి స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. అతడి గురించి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాను. అందుకు ఆ పరిశ్రమలో నేను పనిచేయకుండా చేశాడు’ అని ఆమె గుర్తు చేశారు.

చిన్మయి ఐదేళ్ల క్రితం మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. తమిళ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు దక్షిణాదిన సంచలనం సృష్టించాయి. తమిళ చిత్ర పరిశ్రమ ఆమెపై నిషేధం కూడా విధించింది. దాదాపు నాలుగేళ్ల నిషేధం తర్వాత గతేడాది అక్టోబర్‌లో తమిళ పరిశ్రమలోకి ఆమె తిరిగి ఇచ్చింది. 

ఓ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పింది. విజయ్‌ హీరోగా, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘లియో’. ఇందులో త్రిష పాత్రకు చిన్మయి గాత్రం అందించింది. తమిళం, తెలుగు, కన్నడలో డబ్బింగ్‌ చెప్పింది. మరోవైపు వైరముత్తు లైంగిక వేధింపుల కేసులో న్యాయం కోసం చిన్మయి పోరాటం సాగిస్తూనే ఉంది.

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్రమ‌లో మ‌హిళ‌ల‌కు వేధింపులు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆ అంశాన్ని అధ్యయనం చేసేందుకు కేర‌ళ స‌ర్కారు హేమా క‌మీష‌న్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జి కే హేమా ఆ క‌మీష‌న్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. న‌టి శార‌దతో పాటు మాజీ సివిల్ స‌ర్వీస్ అధికారిణి కేబీ వాత్సల కుమారి ఆ క‌మీష‌న్‌లో స‌భ్యులుగా ఉన్నారు. 

ఆ క‌మీష‌న్ ఇటీవలే త‌న నివేదిక‌ను ముఖ్యమంత్రి విజ‌యన్‌కు స‌మ‌ర్పించింది.మలయాళం సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. సినీ పరిశ్రమలో మహిళా ప్రొఫెషనల్స్‌ లైంగిక వేధింపులు, దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నది. అమానవీయ ప్రవర్తనకు బాధితులుగా ఉన్నారని తెలిపింది. 

పరిశ్రమను కొంత మందితో కూడిన ఒక ‘క్రిమినల్‌ గ్యాంగ్‌’ నియంత్రిస్తున్నదని పేర్కొన్న కమిటీ లొంగని మహిళలను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేస్తారని వెల్లడించింది. కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌ మధ్య ఒప్పందం ఉన్నదని కమిటీ నివేదిక ఆరోపించింది. 2017లో ఓ నటిపై దాడి కేసు తర్వాత ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.