ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు నమితకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లిన తనను అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరాలను వెల్లడించారు. తనతో పాటు కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణపత్రం అడిగారని ఆమె చెప్పారు.
దురుసుగా, అహంకారపూరితంగా సిబ్బంది, అధికారులు వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పుట్టుకతోనే హిందువునేనని, తనతో అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నమిత డిమాండ్ చేశారు. ఆలయ అధికారుల తీరు తనను ఎంతో బాధకు గురి చేసిందని నమిత పేర్కొంది. అయితే, ఈ ఘటనపై ఆలయ పరిపాలన స్పందించింది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము అలా వ్యవహరించామని, కొంత సమయం వేచి ఉండాలని తాము చెప్పామని, అడ్డుకోలేదని అధికారులు వివరణ ఇచ్చారు. నమితతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించామని పేర్కొంటున్నారు. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఇదిలా ఉండగా నమిత స్వస్థలం గుజరాత్లోని సూరత్. ఆమె 2002లో సొంతం మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వెంకటేశ్ సరసన ‘జెమిని’ మూవీలో నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో చివరిసారిగా సింహా మూవీలో నటించింది. నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కవలలు ఉన్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. కొద్దిరోజుల కిందట బీజేపీలో చేరింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.

More Stories
లోయలో ప్రత్యేక ప్రాంతంకై కశ్మీరీ పండిట్ల ఉద్యమం
హింసామార్గాన్ని వదిలివేస్తున్న మావోయిస్టులు
శ్రీ వైష్ణో దేవి మెడికల్ కాలేజీలో 90 శాతం ముస్లిం విద్యార్థులు!