విశాఖ మెడ్‌టెక్‌ తొలిసారి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ తయారీ

విశాఖ మెడ్‌టెక్‌ తొలిసారి మంకీపాక్స్‌ ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ తయారీ

విశాఖ మెడ్​టెక్ జోన్ మరో ఘనత నమోదు చేసింది. కరోనా సమయంలో అరోగ్య రంగానికి కావాల్సిన పలు దేశీయ ఉత్పత్తులు అందించిన ఈ మెడ్​టెక్ జోన్ తాజాగా ప్రపంచానికి మరోమారు హెచ్చరిస్తున్న మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తయారైన తొలి మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్​ను ఉత్పత్తి చేసింది.  మెడ్​టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్ డీఎక్స్ మంకీ పాక్స్ కెకె ఆర్టీ-పాక్స్ పేరిట కిట్ రూపకల్పన చేసింది.

ఈ కిట్​కి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించింది.  ప్రపంచ ఆరోగ్య అవిష్కరణలలో మందంజలో భారతదేశ స్ధానాన్ని ఈ అవిష్కరణ ప్రతిబింబిస్తుందని మెడ్​టెక్ జోన్ సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ తెలిపారు. గతంలో మంకీపాక్స్‌గా పిలుచుకున్న ఎంపాక్స్‌గా ఇప్పుడు మళ్లీ కలకలం సృష్టిస్తోంది. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, దాని చుట్టుపక్కల దేశాల్లో ఎంపాక్స్‌ విరుచుకుపడుతోంది. 

ఇది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నట్టు (పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్న్‌) ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా విజృంభించినప్పుడు సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి హెచ్చరికే జారీ చేయటం గుర్తుండే ఉంటుంది. ఎంపాక్స్‌ కారక వైరస్‌లలో క్లేడ్‌ 1బీ అనే కొత్తరకం మరింత ప్రమాదకరమైంది. 

ఇది ఎక్కువ ప్రాణాంతకంగా పరిణమించే అవకాశముండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలిసారి ఆఫ్రికాను దాటుకొని స్వీడన్​కు విస్తరించింది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌కూ ఎంపాక్స్​ విస్తరించటం గమనార్హం. మన దగ్గరా విమానాశ్రయాల వంటి చోట్ల ఇప్పటికే తగ జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభించడంతో పాటు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.