రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎప్పుడూ తటస్థం కాదు!

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎప్పుడూ తటస్థం కాదు!
మానవతా సహాయం కోసం భారత్ ఎల్లప్పుడూ ఉక్రెయిన్‌కు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకు హామీ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి భారతదేశం దూరంగా ఉందని, అయితే ఇది “ఎప్పటికీ తటస్థంగా” లేదని, ఎల్లప్పుడూ “శాంతికి అనుకూలంగా” ఉందని స్పష్టం చేశారు.
 
 “మేము అనుసరించిన రెండవ మార్గం యుద్ధానికి దూరంగా ఉండటం. మేము నిశ్చయతతో యుద్ధానికి దూరంగా ఉన్నాము కానీ మేము తటస్థంగా ఉన్నామని దీని అర్థం కాదు. మేము ఎప్పుడూ తటస్థంగా లేము. మేము మొదటి రోజు నుండి శాంతికి అనుకూలంగా ఉన్నాము. నేను శాంతి సందేశంతో ఉక్రెయిన్ గడ్డపైకి వచ్చాను’’ అని ప్రధాని మోదీ జెలెన్స్కీతో తెలిపారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, వైద్యం, సంస్కృతి, మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మోదీ ఉక్రెయిన్ పర్యటన ఓ మైలురాయిగా నిలుస్తుందన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు.

ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ, ఔషధ, వ్యవసాయం, విద్య రంగాల్లో సహకారంపై మోదీ, జెలెన్​స్కీ చర్చించినట్లు పేర్కొన్నారు జైశంకర్. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి కూడా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు.

శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్‌ సుముఖంగా ఉందని మోదీ పునరుద్ఘాటించనట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పోలండ్‌ పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ, 10 గంటలు ప్రయాణించి ఉక్రెయిన్‌ చేరుకున్నారు. అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్‌ వద్ద మోదీకి ఘన స్వాగతం పలికారు. 

అనంతరం రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. ఉక్రెయిన్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు.

“అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించాం. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైంది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” అని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో గాంధీకి నివాళులు అర్పిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు.

1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఆరు వారాల కింద రష్యాలో పర్యటించిన ప్రధానిపై అమెరికా, పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వచ్చాయి. యుద్ధంలో భారత్‌ ఏ పక్షానికీ మద్దతుగా ఉండదని, కేవలం శాంతికి వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు.