చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు కొట్టివేత

చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు కొట్టివేత

ఓటుకు నోటు కేసులో వైఎస్సార్​సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంటూ రెండు పిటిషన్లను తోసిపుచ్చింది. వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది.  ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది.

పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా తీసింది. పిటిషనర్‌ 2014 నుంచి ఇటీవల ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని, పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో కూడా ప్రతిపక్షంలోనే ఉందని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వివరించారు. కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ధర్మాసనం సూచించింది. 

ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది జాబితా ఇచ్చారు. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని లూథ్రా తెలిపారు. కేసుల జాబితా చూశాక పిటిషనర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.