క్రిమినల్​ గ్యాంగ్​ చేతిలో మలయాళ చిత్ర పరిశ్రమ

క్రిమినల్​ గ్యాంగ్​ చేతిలో మలయాళ చిత్ర పరిశ్రమ
మలయాళ చిత్రసీమ పరిశ్రమ క్రిమినల్‌ గ్యాంగ్‌ చేతిలో ఉందని తాజా నివేదిక వెల్లడించింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ  నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. 2017లో మలయాళ నటి కిడ్నాప్‌ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే! 

కారులో ఆమెపై లైంగిక దాడులకు జరిపినట్లు నటుడు దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతడు అరెస్టయ్యాడు. అదే సమయంలో మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్ఘ్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం ప్రారంభించింది. పరిశ్రమలో  చోటుచేసుకునే నేరాలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని సూచించింది. 

పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు తమకు వెల్లడించిన లైంగిక వేధిపుల కథనాలు విని షాక్​కు గురయ్యామని కమిటీ పేర్కొంది.  పరిశ్రమలో పనిచేసే మహిళలు వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారని, కాస్టింగ్‌ కౌచ్‌, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్‌ హేమ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. 

సినిమా పనులు మొదలు కాకముందే లైంగిక దాడులకు పాల్పడుతున్నారని అనేకమంది బాధితులు ఆరోపించినట్లు తాజా నివేదికలో తెలిపారు.  ఆ నివేదిక ప్రభుత్వానికి అందినప్పటికీ అందులోని విషయాలు గోప్యంగా ఉంచారు.  దీనిపై మలయాళ చిత్ర నిర్మాత హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీంతో నివేదిక విడుదల ఆగిపోయింది.

తాజాగా సమాచార హక్కు చట్టం కింద బయటకు వచ్చిన ఆ నివేదికలో అనేక దిగ్ర్భాంతి కర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రిపోర్ట్​ను విడుదల చేయాలని ఆశ్రయించిన మీడియా కార్యకర్తలతో పాటు ఐదుగురు వ్యక్తులకు ఈ నివేదికను అందజేశారు. మాలీవుడ్‌లో పని చేసే  మహిళా నటులపై వేధింపులు విషయాన్ని ఎత్తి చూపించింది. 

డ్రగ్స్‌ మత్తులో మునుగుతూ బాధిత మహిళల రూమ్‌ తలుపులు తట్టేవారని, వారిలో అనేక మంది లైంగిక వేధింపులకు గురయ్యారని పేర్కొంది. భయం కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది. తమ డిమాండ్లకు సిద్థంగా ఉండే మహిళలకు కోడ్‌ ఇచ్చేవారని, తిరస్కరించిన వారికి అవకాశాలు లేకుండా చేసేవారని నివేదికలో తెలిసింది.  

సినిమాలో నటించాలన్నా, మరే పని చేయాలన్నా లైంగికంగా సన్నిహితంగా మెలిగితేనే అవకాశాలు ఇస్తున్నట్లు  గుర్తించామని హేమ కమిటీ పేర్కొంది. ఇలాంటి కేసుల్లో ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు ఉన్నారని,  ఎవరైనా నటీమణులపై కోపం ఉంటే వారికి శిక్షగా ఎక్కువగా రిట్​రి షాట్ లు ఇస్తారని, ఓ నటికి ఒకే షాట్​ను 17 సార్లు చేయించి వేధించారని నివేదిక వెల్లడించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతంగా పురుష అహంకారం ఉందని స్పష్టం చేసింది.

ఏదైనా ఉద్యోగం చేయాలి, సినిమాల్లో నటించాలనే ఆశతో ఉన్న మహిళలు రాజీ పడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని తెలిపింది.  కుటుంబ సభ్యులకు ముప్పు వాటిల్లుతుందని, ప్రాణాలకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు బయటకి రావడం లేదని వివరించింది. చిత్ర పరిశ్రమలో కనిపించే దాన్ని అసలు నమ్మవద్దని, ఉప్పు కూడా చక్కెరలా కనిపిస్తోందని కమిటీ హెచ్చరించింది.