పోలెండ్, యుక్రెయిన్ లలో ప్రధాని మోదీ పర్యటన 

పోలెండ్, యుక్రెయిన్ లలో ప్రధాని మోదీ పర్యటన 

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల21న పోలెండ్‌ను, రెండు రోజుల తరువాత 23న యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌ను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) సోమవారం ప్రకటించింది. ఎంఇఎలో పశ్చిమ విభాగం కార్యదర్శి తన్మయ లాల్ ఈ ప్రకటన చేశారు. భారత ప్రధాని ఒకరు 45 ఏళ్లలో పోలెండ్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి.

ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ పర్యటన చోటు చేసుకుంటున్నది. కాగా, ఒక భారత ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం 30 పైచిలుకు సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ‘నేతల మధ్య ఇటీవలి ఉన్నత స్థాయి చర్చలను ఈ పర్యటన ముందుకు తీసుకువెళుతుంది’ అని తన్మయ లాల్ సూచించారు.

యూరప్‌లోని పోలాండ్‌ భారత్‌కు వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతున్నది. ఆ దేశానికి చెందిన 30 కంపెనీలు భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. ఆ దేశంలో భారత్‌కు చెందిన సుమారు 5వేల మంది సైతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ  ఆ రెండు దేశాలను సందర్శిస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించకుండా భారత్ సంయమనం పాటించినందున ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ పర్యటన ప్రభావం ఏమాత్రం ఉంటుందో వేచి చూడవలసి ఉంటుంది.

23న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌ స్కీతో మోదీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేలా రష్యాను ఒప్పించాలని ఉక్రెయిన్‌ భారత ప్రధానిని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు నేతలు భేటీకానుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.  ప్రత్యేక సైనిక చర్యగా మాస్కో అభివర్ణించిన ఆ దురాక్రమణ గురించి ప్రధాని మోదీ బాహాటంగా మాట్లాడారు. ఆ వివాదం పరిష్కారానికి పరస్పర చర్చలు అవసరమని ఆయన సూచించారు.

అయితే, ఆ వివాదంపై భారత విస్పష్ట వైఖరి పాశ్చాత్య దేశాల విమర్శలకు గురైంది.  చైనా ప్రభావం తగ్గించేందుకు న్యూఢిల్లీతో తన సంబంధాల పటిష్ఠతకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాల పట్ల అమెరికా విచారం వెలిబుచ్చింది. మరొక వైపు పాశ్చాత్య దేశాలతోను, తన దీర్ఘకాలిక మిత్ర దేశం రష్యాతోను సంబంధాలు కొనసాగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.