
రోగులను కొంతదూరం ఒక అంబులెన్స్లో, ఆ తర్వాత మరో అంబులెన్స్లో, అనంతరం ఇంకో అంబులెన్స్లో తరలిస్తున్న ఘటనలు రాష్ట్రంలో ఇటీవల పెద్దయెత్తున వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ బిల్లులు రాబట్టడం కోసమే ఇలా చేస్తున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చిత్రదుర్గకు చెందిన సయ్యద్ ఇఫ్తిఖార్కు గత నెల 19న గుండెపోటు వచ్చింది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని జయదేవ దవాఖానకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో సయ్యద్ సోదరుడు ముంతాజ్ 108 సర్వీసుకు ఫోన్ చేశాడు.
గంట తర్వాత వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ ఇఫ్తిఖార్ను ఎక్కించుకొని 20 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లి అక్కడే రోడ్డుపై నిలిపేశాడు. అదేమిటని ప్రశ్నిస్తే, `మా కంపెనీ నిబంధనలు ఇంతే.. ఇంకో అంబులెన్స్ వచ్చేవరకూ వేచి ఉండండి’ అని బదులిచ్చాడు. అలా ఆరు గంటల్లో ఆరు ఆంబులెన్స్లను మార్చారు. చివరకు దవాఖానలో చేరిన ఇఫ్తిఖార్ పరిస్థితి అత్యంత విషమంగా తయారైంది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది. ఆగస్టు 5న కూడా ఓ గర్భిణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఆమె పురిట్లోనే బిడ్డను కోల్పోయింది. ఆంబులెన్స్ల మార్పుతో ఎక్కువ మంది రోగులకు సేవలు అందించామని చూపించి, ఎక్కువ బిల్లులు వసూలు చేయడానికే ఇలా చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
108 సేవలను అందిస్తున్న ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసులో పనిచేస్తున్న కొందరు అక్రమార్కుల వల్లే ఇదంతా జరుగుతున్నట్టు మండిపడుతున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండురావు త్వరలోనే కొత్త టెండర్లను ఆహ్వానిస్తామని చెప్పారు. అయితే, ఈ స్కామ్లో ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి.
More Stories
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!
దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్