వినేశ్ ఫొగాట్‌కు స్వగ్రామంలో గోల్డ్ మెడల్

వినేశ్ ఫొగాట్‌కు స్వగ్రామంలో గోల్డ్ మెడల్
పారిస్ నుంచి బ‌రువెక్కిన గుండెతో స్వ‌దేశం వ‌చ్చిన భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ కు అడుగ‌డుగునా ఆత్మీయ స్వాగ‌తం ల‌భిస్తోంది. శనివారం ఢిల్లీ విమానాశ్ర‌యంలో కాలు మోపింది మొద‌లు సొంతూరైన బ‌లాలి  చేరుకునేంత వ‌ర‌కూ వినేశ్‌కు అభిమానులు ఘనస్వాగతం చెప్పారు. ఇక ఇచ్చిన మాట ప్రకార‌మే బ‌లాలి గ్రామ పెద్ద‌లు ఆమెకు గోల్డ్ మెడ‌ల్ ప్ర‌దానం చేశారు.
 
విశ్వ క్రీడ‌ల్లో ప‌తం చేజార్చుకున్న వినేశ్‌కు రెజ్ల‌ర్లు బ‌జ్‌రంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు చాంపియ‌న్ త‌ర‌హాలో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం బ‌లాలిలో ఆమె మేన‌మామ మ‌హ‌వీర్ ఫొగాట్, ఖాప్ పంచాయ‌తీ పెద్ద‌లు వినేశ్‌కు గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో ఆహ్వానించారు. ‘ఒలింపిక్ మెడ‌ల్ గెల‌వ‌కున్నా స‌రే.. నువ్వు ఎప్ప‌టికీ చాంపియ‌న్‌వే’ అంటూ ఆమెను ఘ‌నంగా స‌న్మానించారు. రెజ్ల‌ర్‌ను పూల దండ‌లు, త‌లపాగాతో స‌న్మానించిన అనంత‌రం వినేశ్‌కు స్వ‌ర్ణ ప‌త‌కాన్ని అంద‌జేశారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
 
భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌కు సొంతగడ్డపై అపూర్వ స్వాగతం లభించింది. అందరూ ఊహించినట్లే పతక విజేతలకు మించి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి రెజ్లర్‌కు స్వాగతం పలికారు. శనివారం ఉదయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఫోగాట్‌ కోసం సహచర రెజ్లర్లు సాక్షి మాలిక్‌, జబరంగ్‌ పునియాతో పాటు హర్యానా కాంగ్రెస్‌ లీడర్‌ దీపేందర్‌హుడా, పంచాయత్‌ సభ్యులు తరలివచ్చారు. ఓవైపు ‘డోల్‌’ చప్పుల మధ్య ఫ్యాన్స్‌ నృత్యాలు చేస్తూ వినేశ్‌పై పూల వర్షం కురిపించారు.

ఓపెన్‌టాప్‌ జీపులో బజరంగ్‌, సాక్షితో కలిసి అభిమానులకు అభివాదంచేస్తూ వినేశ్‌ ముందుకు సాగింది. ఈ క్రమంలో దీపేందర్‌ విజయానికి చిహ్నామైన గదను బహుకరించగా.. ఒకింత భావోద్వేగానికి లోనైన వినేశ్‌ను ఆమె భర్త సోమ్‌వీర్‌, సాక్షి, దీపేందర్‌ ఓదార్చారు. తన సొంత గ్రామమైన బలాలీకి చేరుకునే క్రమంలో ఢిల్లీలోని ద్వారక దేవాయలంలో వినేశ్‌ పూజలు చేసింది. 

మొత్తం 135 కి.మీ ప్రయాణానికి దాదాపు 10 గంటల సమయం పట్టగా, దారి మధ్యలో పలు కాప్‌ పంచాయతీలకు చెందిన సభ్యులు ఆమె ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మీరు నాపై చూపించిన ప్రేమ, గౌరవం..1000 ఒలింపిక్‌ పసిడి పతకాలు గెలిచిన దాని కంటే ఎక్కువ’ అని చెమర్చిన కండ్లతో అంది. 

ఇదిలా ఉంటే ఇప్పటికే తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన వినేశ్‌..కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కొద్దిరోజలు కుటుంబసభ్యులతో గడిపిన తర్వాత వినేశ్‌ ఏదో ఒక నిర్ణయానికి వస్తుందని సాక్షి మాలిక్‌ పేర్కొంది.