కామక్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నిర్వహించిన లవ్ ఇండియా సర్వ్ ఇండియా కార్యక్రమంలో స్వామి బోధమయానంద ప్రసంగించారు.
కామాన్ని జ్ఞానమనే ఖడ్గంతో జయించాలని చెబుతూ ఇంద్రియాల నుంచి స్వాతంత్ర్యం పొందితేనే నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లు అవుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్ ల నుంచి కూడా స్వాతంత్ర్యం పొందాలని ఆయన సూచించారు. చెడు ఆలోచనల నుంచి సదాలోచనల వైపు మరలాలని యువతకు స్వామీజీ సూచించారు.
‘‘లవ్ ఇండియా సర్వ్ ఇండియా’’అని స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని యువత సన్మార్గంలో నడిచి జీవితాలను సార్థకం చేసుకోవాలని స్వామీజీ సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతో ప్రగతిని సాధించామని, అయితే సాధించాల్సినది ఇంకా చాలా ఉందని చెప్పారు.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ లక్ష్యం లేని సాధన నిరర్థకమని తెలిపారు. సమాజ హితానికి వ్యక్తి తోడ్పడకపోతే లాభం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అధ్యాపకులు, రామకృష్ణ మఠం వాలంటీర్లు, యువతీ యువకులు పాల్గొన్నారు.

More Stories
లొంగుబాటుకు మావోయిస్టులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధం
కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా