
భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఆర్థిక సంస్కరణల కొత్త శకానికి పునాది పడిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం గర్వించాల్సిన విషయమని, మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో దేశం ఉన్నట్టు ఆమె తెలిపారు.
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ, సెమి కండక్టర్లు, పటిష్టమైన బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై ప్రభుత్వం దృష్టిసారించిందని ఆమె చెప్పారు. సామాజిక న్యాయానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నదని, ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన సమాజాల సంక్షేమం కోసం అపారమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.
విభజిత ధోరణులను తిప్పికొట్టాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. గత దశాబ్ద కాలంగా క్రీడా రంగంలో భారత్ అద్భుతంగా పురోగతి సాధించిందని ఆమె పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో భారతీయ క్రీడాకారుల ప్రదర్శనను, టీ20 ప్రపంచ కప్లో టీమిండియా విజయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
దేశం కోసం త్యాగాలు చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నానని చెబుతూ ఈ సందర్భంగా ఆమె దేశ ప్రజలకు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో త్రివర్ణాన్ని ఆవిష్కరించడం ఉత్కంఠభరితమైన అనుభూతిని కలిగిస్తోందని చెప్పారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేశం సిద్ధమవుతున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
త్రివర్ణ రంగులజెండా ఎగురవేయడం ఎల్లప్పుడూ మన హృదయాలను పులకింపజేస్తుందని ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పోరాటంలో పాల్గొన్న వారి కలలు సాకారం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ను ఆమె గుర్తు చేసుకున్నారు.
దేశవ్యాప్త ఉద్యమంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయని చెబుతూ గిరిజనుల్లో తిల్కా మాంఝీ, బిర్సా ముండా, లక్ష్మణ్ నాయక్ తదితరుల త్యాగాలకు ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. బిర్సా ముండా జన్మదినాన్ని దేశం జనజాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటున్నామని ఆమె గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఆయన 150వ జయంతి వేడుకలు జాతీయ పునరుజ్జీవనానికి ఆయన చేసిన కృషిని మరింత గౌరవించే అవకాశంగా ఉంటుందని పేర్కొన్నారు.
దేశం విభజన భయాందోళనలను గుర్తుచేసుకునే రోజు ఆగస్టు 14న విభజన్ విభిషిక స్మృతి దివస్ను పాటిస్తున్నదని ముర్ము చెప్పారు. దేశ విభజనతో లక్షలాది మంది వలసల వెళ్లారని, లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కేంద్రం సామాజిక న్యాయానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన లోక్సభ ఎన్నికలు మానవ జాతి చూసిన అతిపెద్ద ఎన్నికల కసరత్తు అని పేర్కొన్నారు. విజయవంతంగా ఎన్నికలను నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను బలోపేతం చేస్తుందని ఆమె తెలిపారు. ఎన్నికలు శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని ప్రస్ఫుటం చేశాయని చెబుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించిన ఈసీకి అభినందనలు తెలిపారు. ఎండ వేడిని తట్టుకొని ఓటర్లకు సహకారం అందించిన అధికారులు, భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం