భారత అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ అరిఘాత్

భారత అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ అరిఘాత్
ఇండియన్ నేవీని ఎప్పటికప్పుడు మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత నావికాదళానికి మరో కొత్త అత్యాధునిక జలాంతర్గామి వచ్చి చేరనుంది. నేవీ వద్ద ఇప్పటివరకు ఐఎన్ఎస్ అరిహంత్ అనే న్యూక్లియర్ మిసైల్ జలాంతర్గామి ఉండగా తాజాగా నిర్మిస్తున్న ఐఎన్ఎస్ అరిఘాత్ పూర్తయితే అది కూడా నావికా దళంలో సేవలు అందించనుంది. 

ఇక ఈ రెండు చేరడంతో భారత నేవీ అమ్ములపొదిలో మరింత బలం వచ్చి చేరనుంది. 2018 నుంచి ఐఎన్‌ఎస్ అరిహంత్ న్యూక్లియర్ మిసైల్ సబ్‌మెరైన్ ఇండియన్ నేవీ వద్ద అందుబాటులో ఉంది. ఇక మరో రెండు నెలల్లో ఐఎన్ఎస్ అరిఘాత్ కూడా నావికా దళంలో చేరనుంది.

అయితే ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ ఐఎన్‌ఎస్ అరిహంత్‌ లాగా సాధారణమైన జలాంతర్గామి కాదని నేవీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ న్యూక్లియర్ వార్ హెడ్‌లతో కూడిన బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 6000 టన్నుల బరువు ఉన్న ఈ మిస్సైల్‌ సబ్‌మెరైన్‌ను వైజాగ్‌లోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో తయారు చేస్తున్నారు.

ఈ ఐఎస్ఎస్ అరిఘాత్‌ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తుండటం విశేషం.  ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ సబ్‌మెరైన్ పై భాగంలో 4 గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన నాలుగు కె-4 సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ఆ 4 గొట్టాల్లో నుంచి ఒకే సమయంలో లక్ష్యం దిశగా ప్రయోగించే వీలు ఉంటుంది. 
 
ఇక ఈ బాలిస్టిక్ మిసైళ్లు.. దాదాపు 3500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కె-15 రకం సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను 12 ఏకకాలంలోనే ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇక టార్పిడోలను వినియోగించే సామర్థ్యం కూడా ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ సొంతం. 
 
ఒక్కోసారి సముద్ర జలాల్లో ఉండగానే భద్రతకు సంబంధించి అనేక నిఘా వ్యూహాలను రూపొందించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో కొన్ని నెలల పాటు జలాంతర్గాములు నీటిలోనే ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో ఇంధనం కోసం సబ్‌మెరైన్లు.. నీటి అడుగు నుంచి పైకి రావాల్సిన అవసరం లేదు. వాటిలో రూపొందించిన రియాక్టర్లు జలాంతర్గాములకు కావాల్సినంత ఇంధనాన్ని సరఫరా చేస్తాయి. దీనితో నెలల తరబడి సముద్రం అడుగులోనే ఈ సబ్‌మెరైన్‌లను ఉంచవచ్చు. 
 
ఇక ప్రపంచంలోనే అమెరికా నేవీకి అత్యధిక సబ్ మెరైన్లు ఉన్నాయి. ఆ తర్వాత 10 సబ్ మెరైన్లు కలిగి చైనా రెండో దేశంగా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్ నేవీని మరింత పటిష్ఠంగా తయారు చేసేందుకు సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ తర్వాత ఇలాంటివే మరో 2 జలాంతర్గాములు కూడా ఇండియన్ నేవీకి చేరనున్నాయి.