అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా అహ్లాన్‌ గడోల్‌ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉన్న అహ్లాన్ గడోల్‌లో ఉగ్రవాద జాడ గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. 
 
భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం దాడులను తిప్పికొడుతున్నాయి. సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా సమాచారం. పారిపోకుండా భద్రతా బలగాలు వారిని దిగ్బంధించాయి.
 
అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులకు గాయాలైనట్లు సమాచారం. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయని జమ్మూ కశ్మీర్‌ పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
 
కాగా, తాజాగా నలుగురు ఉగ్రవాదులకు చెందిన ఊహాచిత్రాలను కథువా పోలీసులు శనివారం ఉదయం రిలీజ్‌ చేశారు. జిల్లాలోని మల్హర్‌, బని, సియోజ్‌ ధర్‌ లోయ ప్రాంతాల్లో కనిపించిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను గీసి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. వారిని పట్టుకునేందుకు రివార్డు కూడా ప్రకటించారు. ఫొటోల్లో ఉన్న ఉగ్రవాదుల గురించిన సమాచారం అందించిన వారికి రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
 
ఇటీవల అనంత్‌నాగ్‌లో భక్తులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 40 మంది వరకు గాయపడ్డారు. 2021 నుంచి జమ్మూ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద ఘటనలో 52 మంది భద్రతా సిబ్బంది సహా 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలను భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. భారత్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులకు పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐ సహకారం అందిస్తున్నాయి.