సునీతా విలియమ్స్‌ భూమిపైకి తిరిగి వచ్చేది 2025 ఫిబ్రవరిలోనే

సునీతా విలియమ్స్‌ భూమిపైకి తిరిగి వచ్చేది 2025 ఫిబ్రవరిలోనే
నాసాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బారీ విల్మోర్‌ బోయింగ్‌కు చెందిన స్పేస్‌షిప్‌లో ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌లో సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. అయితే, ఇద్దరు వ్యోమగాములు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. 
 
ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కీలక ప్రకటన విడుదల చేసింది. బోయింగ్‌ స్టార్‌ లైనర్‌లో వెళ్లిన ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేసిన సమయంలో ఉన్న ఆప్షన్‌ను పరిశీలించినట్లు నాసా తెలిపింది. సునీతా విలియమ్స్‌, బారీ విల్మోర్‌ను స్టార్‌లైనర్‌ జూన్‌ 5న ఇంటర్‌నేషనల్‌ ఐఎస్‌ఎస్‌కు తీసుకు వెళ్లింది. 
 
ఎనిమిది రోజుల మిషన్‌ను పూర్తి చేసుకొని మళ్లీ భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే, హీలియం లీక్‌తో పాటు థ్రస్టర్‌ లోపం కారణంగా వ్యోమగాములు తిరిగి రావడం వాయిదాపడింది.  బోయింగ్ సంస్థకు ఇదే తొలి మిషన్‌. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ రెండు నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
 
వీరిని తిరిగి తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఇద్దరు 2025 ఫిబ్రవరిలో మాత్రమే భూమిపైకి తిరిగి వచ్చేందుకు అవకాశం ఉన్నట్లుగా నాసా పేర్కొంది. స్పేస్‌ ఎక్స్‌ ప్లాన్‌ను ఇందులో భాగం చేసినట్లు తెలిపింది. కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ మాట్లాడుతూ ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురావడం తమ మొదటి ప్రాధాన్యత తెలిపారు. 
 
ఎలాన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌తో నాసా పని చేస్తుందని పేర్కొన్నారు. స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్యాగన్‌ షిఫ్‌తో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. స్పేక్స్‌ క్రూ-9 మిషన్‌లో ఇద్దరు వ్యోమగోములతో క్రూ డ్రాగన్‌ను పంపేందుకు అవకాశం ఉంది. దీని ప్రయోగం సెప్టెంబర్‌లో ఉండవచ్చని తెలుస్తున్నది. 
 
దాంతోనే సునీత విలియమ్స్‌, విల్మోర్‌ను భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తున్నారు. స్టార్‌లైనర్‌లోనే తీసుకురావాలా? లేకపోతే క్రూ డ్రాగన్‌ను ఉపయోగించాలా? అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.