12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు షెడ్యూల్ విడుదల అయింది. ఇటీవల కొందరు రాజ్యసభ సభ్యులు వివిధ కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆ ఖాళీలను నింపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అయింది. ఈ క్రమంలోనే 12 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది. 

 9 రాష్ట్రాల పరిధిలో ఉన్న 12 స్థానాలకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించి తాజాగా అన్ని తేదీలను ప్రకటించింది. అయితే ఇందులో తెలంగాణ నుంచి కూడా ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కే కేశవరావు  రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఉపఎన్నిక జరగనుంది. తెలంగాణలోని ఒక సీటు కాంగ్రెస్ గెల్చుకొనే అవకాశం ఉండగా, మిగిలిన 11 సీట్లను ఎన్డీయే పక్షాలు గెల్చుకోవడం దాదాపు ఖాయంగా భావిస్తున్నారు.

9 రాష్ట్రాల్లోని 12 స్థానాల‌కు సెప్టెంబ‌ర్ 3 వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్నట్లు తెలిపింది. అదే రోజు సాయంత్రం 5 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

రాజ్యసభ సభ్యులుగా ఉన్న 10 మంది ఎంపీలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరికి తోడు తెలంగాణలో రాజ్యసభ ఎంపీగా ఉన్న కే కేశవరావు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు ఒడిశాకు చెందిన ఓ రాజ్యసభ ఎంపీ కూడా రాజీనామా చేయడంతో మొత్తం ఖాళీల సంఖ్య 12 కు చేరింది.
 
అస్సాం, బీహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌, సర్బానంద సోనోవాల్‌, జ్యోతిరాదిత్య సింధియాలు అప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా ఉండగా ఇటీవల ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డాయి.