మహిళా భద్రతకై గవర్నర్ చొరవ తీసుకోవాలి

మహిళా భద్రతకై గవర్నర్ చొరవ తీసుకోవాలి
తెలంగాణాలో అనునిత్యం ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదని పేర్కొంటూ మహిళలపై జరుగుతున్న సంఘటనలను ఆపేందుకు  జ్యోక్యం చేసుకోవాలని  తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను బిజెపి మహిళా మోర్చా కోరింది. రాజ్ భవన్ లొ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి వినతిపత్రం సమర్పించారు.

ఒక అత్యాచార సంఘటన మరువకముందే మరొక సంఘటన జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య, ఉదాసీన వైఖరి గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ సి ఆర్ బి డేటా ప్రకారం 2023లొ తెలంగాణలొ నేరల రేటు 12 శాతంకు పెరిగిందని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రయాణికుల వరకు మహిళలకు రక్షణ లేదని  ఆమె విచారం వ్యక్తం చేశారు.

 
వారం రోజుల క్రిందట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిఒడ్డున మలక్ పెట్ లో ఉన్న అంధుల హాస్టల్ ఉన్నటువంటి అంధ బాలికపైన స్కావెంజర్ అత్యాచారానికి పాల్పడిన ఘటనని ఆమె ఉదహరించారు. వనస్థలీపురంలో ఓ సాఫ్ట్ వేర్  ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం, ఓ.యూ పి.ఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, షాద్ నగర్ పి ఎస్ లో విచారణ అంటూ దళిత మహిళాపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచక్షరహితంగా కొట్టిన తీరును ఆమె వివరించారు. 
 
నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం పేర్కొంటూ గత కొన్ని రోజుల వ్యవధిల్లోనే  సుమారుగా 20కు పైగా అత్యాచార  ఘటనలు జరుగుతున్నా  రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని డాక్టర్ శిల్పారెడ్డి   ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో మహిళలలపై జరుగుతున్న అఘాయిత్యాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారని ఆమె తెలిపారు.
చాలా సార్లు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా జ్యోక్యం చేసుకుంటే తప్ప మహిళలపై నేరలకు పాల్పడిన నిందితులపై ఎటువంటి కేసులు నమోదు కాలేదని ఆమె చెప్పారు.  అందువల్ల, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నివేదిక సమర్పించాలని, అలాగే శాంతిభద్రతలను కఠినతరం చేసేందుకు అవసరమైన సూచనలను జారీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు బిజెపి మహిళా మోర్చా విజ్ఞప్తి చేసింది.