పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు

పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
హమాస్‌, హిజ్బుల్లా నేతల హత్యతో పశ్చిమాసియాలోఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎప్పుడైనా పేల డానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా ఉందని భావిస్తున్నారు. కాల్పుల విరమణపై ఇప్పటివరకు మిణుకుమిణుకు మంటున్న ఆశలు ఈ పరిణామాల తర్వాత పూర్తిగా సన్నగిల్లాయి. 
 
హమాస్‌ రాజకీయ విభాగం అధిపతి హనియే హత్య తరువాత హమాస్‌- ఇజ్రాయిల్‌ వివాదం ఇరాన్‌- ఇజ్రాయిల్‌ మధ్య ఘర్షణకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. తమ గడ్డపై హనియేను హత్య గావించినందుకు ఇజ్రాయిల్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్‌ ఇప్పటికే ప్రకటించింది.
 
ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనిమా, లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ ఫౌద్‌ సుక్రు హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌ మద్దతు గల లెబనాన్‌ కేంద్రంగా నడిచే హెజ్బొల్లా గ్రూపు శనివారం రాత్రి ఇజ్రాయెల్‌ భూభాగం వైపుగా పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డోమ్‌ వ్యవస్థ అడ్డుకొన్నదని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. 
 
కాగా, రాకెట్‌ దాడుల్లో మోషవ్‌ బీట్‌ హిల్లేల్‌లో పలువురు పౌరులు గాయపడినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. మరోవైపు దక్షిణ లెబనాన్‌ నగరం బజౌరీహ్‌పై జరిపిన క్షిపణి దాడిలో కీలక హెజ్బొల్లా నేత అలీ అబ్ద్‌ హతమయ్యాడని ఇజ్రాయెల్‌ మిలటరీ వెల్లడించింది.
 
ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ‘అబ్రహం అలయన్స్‌ వర్సెస్‌ యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ ఇటీవల అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్‌ నుంచి పశ్చిమాసియా రీజియన్‌కు ముప్పు పొంచి వున్నదని, దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ దేశాలతో కూడిన ‘అబ్రహం అలయన్స్‌’ ఏర్పాటుకు ప్రతిపాదించారు. 
 
ఇది అబ్రహం ఒప్పందానికి పొడిగింపు వంటిది. ఇరాన్‌ ప్రభావానికి వ్యతిరేకంగా ప్రధానంగా దాని మద్దతు గల దేశాలు, గ్రూపులతో కూడిన యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌తో దౌత్యపరమైన సంబంధాల ద్వారా పలు దేశాలను ఐక్యం చేసేదే అబ్రహం ఒప్పందం. దీన్ని 2020, సెప్టెంబర్‌లో ప్రారంభించారు.అబ్రహం ఒప్పందంలో ఇజ్రాయెల్‌తోపాటుగా యూఏఈ, బహ్రెయిన్‌, మొరాకో, సూడాన్‌ ఉన్నాయి. మరోవైపు యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌ గ్రూపులో ఇరాన్‌, లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు, యెయెన్‌లోని హౌతీలు, ఇరాక్‌లోని మిలీషియాలు, గాజాలోని హమాస్‌, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌, సిరియాలోని మిలిటెంట్‌ గ్రూపులు ఉంటాయి.
ఉద్రిక్తతల పెరుగుదల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా రీజియన్‌లోని తమ సిబ్బంది, ఇజ్రాయెల్‌ను కాపాడేందుకు సైనిక మోహరింపును పెంచినట్టు అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ నెతన్యాహుకు ఫోన్‌ చేసి ఇజ్రాయిల్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.మరోవైపు లెబనాన్‌ను వెంటనే వీడాలని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది. పశ్చిమాసియా రీజియన్‌లో పరిస్థితి వేగంగా దిగజారుతున్నదని యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్‌ లామీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌ను వెంటనే వీడాలని భారత్‌తోపాటు జోర్డాన్‌, ఫ్రాన్స్‌, కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీచేశాయి.