బిఆర్ఎస్ ను తిట్టడం తప్ప రేవంత్ ఏం చేశారు?

బిఆర్ఎస్ ను తిట్టడం తప్ప రేవంత్ ఏం చేశారు?
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేస్తారో చెప్పటం లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని హితవు చెప్పారు. బ్లాక్ టికెట్‌‌‌లు అమ్మే వారు కూడా మంచిగా మాట్లాడుతారని, శాసనసభలో ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడటం బాధాకరమని  విచారం వ్యక్తం చేశారు. 
 
తమ ప్రభుత్వంపై చాలా అప్పులున్నాయని ముఖ్యమంత్రి, మంత్రులు అన్నారని పేర్కొంటూ లక్షన్నర కోట్లతో మూసీని ఎలా ప్రక్షాళన చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంత్రుల పేషీలో 20మందిని ఎందుకు నియమించు కుంటున్నారని నిలదీశారు. అసెంబ్లీలో సీఎం, మంత్రులు ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతుంటే ప్రధాన అంశాలపై స్పష్టత  ఏవిధంగా వస్తుందని ఆయన అడిగారు.
 
రిటైర్మెంట్ అయిన ప్రధాన బాధ్యతల్లో నియమించుకుంటే వారికి వృత్తి పట్ల ఏం భయం ఉంటుందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై సభలో ఏం చర్చించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విధ్వంసం, పునర్నిర్మాణం అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు . జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే పైసలు హైదరాబాద్‌లోనే ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 
 
ఎన్ఆర్ఈజీఎస్ కేంద్ర నిధులతోనే సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని వెంకటరమణారెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ప్రాజెక్టులు కళ్ల ముందు కనిపిస్తుంటే నిధులు ఇవ్వలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలను సభలో ముఖ్యనేతలే దారిలో పెట్టాలని అన్నారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీ, రోడ్ల ధ్వంసం, అమరుల చావుకు వీటన్నింటికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని చెప్పారు. 
 
కాగా, మాజీ మంత్రి కేటీఆర్ ప్రజా సమస్యలపై పోరాడాలని, ఆయన భాషను మార్చుకోవాలని హితవు పలికారు. అమరుల శవాలపై పేలాలు ఏరుకోవడం మానుకోవాలని బిజెపి ఎమ్యెల్యే సూచించారు. అమరవీరుల పేరుతో కాలయాపన చేయడం తప్ప తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని నిలదీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కలవరని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వద్దకు వెళ్లి కలిస్తే కిరీటం పోతోందా? అని వెంకటరమణరెడ్డి నిలదీశారు.