ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌ డీజీగా తొలిసారి ఓ మహిళా అధికారి

ఆర్మీ మెడికల్ సర్వీసెస్‌ డీజీగా తొలిసారి ఓ మహిళా అధికారి
ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ గా తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయర్‌ కు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. తద్వారా ఈ కీలక పదవి చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందనున్నారు.

ఇంతకుముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్‌ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.

పుణెలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్‌ మార్షల్‌ సాధనా సక్సేనా నాయర్‌ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్‌ మార్షల్‌ హోదాకు చేరుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌కు డైరెక్టర్‌ జనరల్‌ అయ్యారు. చదువుపై ఉన్న ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు.