అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర

అమర్‌నాథ్‌ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర
దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందిన పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర (కు ఉగ్ర ముప్పు పొంచి ఉంది. ఈ పవిత్ర యాత్రలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా  సహకారంతో ఐఎస్‌ఐ ఈ కుట్రకు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 

తీర్థయాత్ర సమయంలో విధ్వంసకర దాడికి పథకం రచించినట్లు హెచ్చరించాయి. ఈ దాడికి పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్‌లు, రాడికల్‌ గ్రూపులు ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపినట్లు నిఘా వర్గాల సమాచారం. పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నాయకులు, హిందూ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిచేందుకు ఐఎస్‌ఐ ప్రణాళిక రచించినట్లు సదరు వర్గాలు హెచ్చరించాయి.దేశంలో విధ్వంసం సృష్టించడానికి జమ్ము కశ్మీర్‌లోకి ఏడుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పఠాన్‌కోట్‌ సమీపంలోని ఓ గ్రామంలో అధునాతన ఆయుధాలతో అనుమానిత ఉగ్రవాదుల కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. 

అలాగే జమ్మూ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్థాన్ కుట్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. 

మరోవైపు ఉగ్ర కుట్ర హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన భారత బలగాలు అమర్‌నాథ్ యాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర గత నెల జూన్‌ 29 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. 

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో అమర్‌నాథ్‌ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇక ఈ ఏడాది యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ (28 రోజుల వ్యవధిలో) 4 లక్షల మంది భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకున్నారు. 

ఈ గుహ కశ్మీర్‌లో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంటుంది. యాత్రికులు ఈ గుహకు చేరుకోవడానికి నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంది. ఇక గత నెల ప్రారంబమైన ఈ యాత్ర 52 రోజుల పాటు కొనసాగుతుంది. ఆగస్టు 19న అమర్‌నాథ్‌ యాత్ర ముగియనుంది.