ఐదు రోజుల తర్వాత పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

ఐదు రోజుల తర్వాత పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

ఐదు రోజులు వరుసగా నష్టాలు చూస్తూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించడం ఐటి స్టాక్స్ లో కొనుగోళ్లకు ఊతం ఇచ్చాయి. ఐటి కంపెనీలకు చాలా వరకు ఆదాయం అమెరికా నుంచే వస్తుంటుంది.

మార్కెట్ పై బుల్స్ మళ్లీ పట్టు సాధించారు. అన్ని సెక్టార్లు గ్రీన్ లోనే ముగిశాయి. సెన్సెక్స్ కొత్త ఆల్ టైమ్ హైకి ఇంకా 166 పాయింట్ల దూరంలో ఉంది. కాగా నిఫ్టీ ఆల్ టైమ్ హైకి కేవలం 1 పాయింట్ దూరంలో నిలిచింది. సెన్సెక్స్ 1292.92 పాయింట్లు లేక 1.61 శాతం పెరిగి 81332.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 428.75 పాయింట్లు లేక 1.76 శాతం పెరిగి 24834.85 వద్ద ముగిసింది.

 నిఫ్టీ 500 లో నేడు న్యూ ఇండియా అస్యూరెన్స్, జిఐసి, పేటిఎం, శ్రీరామ్ ఫైనాన్స్ ప్రధానంగా లాభపడగా, ఎంఎంటిసి, సైయెంట్, రూట్ మొబైల్, మ్యాన్ కైండ్ ఫార్మా ప్రధానంగా నష్టపోయాయి. బంగారం రూ.216.00 లేక 0.32 శాతం పెరిగి రూ. 67678.00 వద్ద ట్రేడయింది. కాగా డాలరు మారకంలో రూపాయి విలువ మారకుండా రూ. 83.72 వద్దే నిలిచింది.

ఎంఎంటిసి షేర్ల వాల్యూమ్ నేడు 6.89 కోట్లు గా ఉంది. ఈ కంపెనీ షేర్లు జులై 24న 14డే మూవింగ్ యావరేజ్ ను క్రాస్ చేసింది. కానీ నేడు నష్టపోయిన షేర్లలో నిలిచింది. ఎంఎంటిసి షేరు రూ. 128.50 వద్ద ఓపెన్ అయి రూ. 131.80 గరిష్ఠాన్ని, రూ. 105.10 కనిష్ఠాన్ని తాకింది. చివరికి రూ. 14.06 పాయింట్లు లేక 11.63 శాతం నష్టంతో రూ. 106.85 వద్ద ముగిసింది.

ఈ స్టాక్ గరిష్ఠాన్ని తాకినా సస్టెయిన్ కాలేదు. కంపెనీ డెట్ ను తగ్గించుకుంది. బుక్ వ్యాల్యూ 10.1 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ పదేపదే లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ డివిడెండ్ చెల్లించడం లేదు. సేల్స్ గ్రోత్ అంత బాగా లేదు. కంపెనీ హై డెటర్స్ 26845 డేస్ కలిగి ఉంది.

కాగా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్వహించిన ఓ అధ్యయనంలో 70 శాతం(10 మందిలో 7గురు) మంది ఇంట్రాడే ట్రేడింగ్ లో అందునా ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో నష్టపోయారని వెల్లడించింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం లో. 2018-19 తో పోల్చుకున్నప్పుడు 2022-23 లో ఇంట్రాడే ట్రేడింగ్ లో 300 శాతం పెరుగుదల కనిపించిందని కూడా సెబీ వెల్లడించింది.

‘‘ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ రిస్క్ తో కూడుకున్నదనే జాగురుకతను సెబీ అధ్యయనం తెలుపుతోంది’’ అని సెబీ వివరించింది. కరోనా మహమ్మారి కాలంలో చాలా మంది యువ ట్రేడర్లు ఇంట్రాడే ట్రేడింగ్ లోకి ప్రవేశించారని కూడా వెల్లడించింది.